Ram Charan Doctorate: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైకు చెందిన ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేయనుంది. వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్ అందజేయడంలో వేల్స్ యూనివర్సిటీ ప్రసిద్ధి చెందింది. కాగా రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన్ని వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. రామ్ చరణ్ కు దక్కిన ఈ గౌరవం పై పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
చలన చిత్ర పరిశ్రమలో తనదైన పంథాలో పయనిస్తున్న శ్రీ రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్ దక్కడం సంతోషాన్ని ఇచ్చింది. శ్రీ రామ్ చరణ్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చెన్నై వేల్స్ యూనివర్సిటీ శ్రీ రామ్ చరణ్ చిత్ర పరిశ్రమకు చేస్తున్న సేవలకు, తన ప్రతిభకు గుర్తింపుగా ఈ డాక్టరేట్ ఇవ్వడం సంతోషకర పరిణామం. డాక్టరేట్ ఇచ్చిన స్ఫూర్తితో రామ్ చరణ్ మరెన్నో విజయవంతమైన చిత్రాలు చేయాలి. మరిన్ని పురస్కారాలు, ప్రజాభిమానం పొందాలని కోరుకుంటున్నాను… అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
అబ్బాయికి దక్కిన గౌరవం పై బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఏప్రిల్ 13న చైన్నైలో జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అప్పుడు ఈ డాక్టరేట్ తో సత్కరించనున్నారు.
మరోవైపు రామ్ చరణ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు శంకర్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ జరుపుకుంటుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ కలెక్టర్ రోల్ చేస్తున్నారని సమాచారం. అలాగే ఆయన డ్యూయల్ రోల్ లో కనిపిస్తారట. చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో 16వ చిత్రం చేస్తున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.