CPI National Secretary Narayana: ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎవరు మిత్రులో.. ఎవరు శత్రువులో తెలియడం లేదు. పొత్తుల కోసం టీడీపీ, జనసేన ఎదురుచూస్తున్న వేళ బీజేపీ విరుద్ధ సంకేతాలు పంపింది. వైసీపీ సర్కారుపై సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఈ తరుణంలో వామపక్షాలు స్పీడు పెంచాయి. బీజేపీతో పొత్తునకు టీడీపీ, జనసేన వెంపర్లాడుతుండడాన్ని తప్పుపట్టాయి. ఆ స్థానాన్ని తాము భర్తీ చేస్తామని సంకేతాలు పంపాయి. ఈ రాష్ట్రానికి ప్రథమ శత్రువు బీజేపీ, రెండో శత్రువు వైసీపీగా అభివర్ణిస్తున్నాయి. ఒకవేళ బీజేపీతో వెళితే అది వైసీపీకి లాభం చేకూరుస్తుందన్న కొత్త పల్లవిని వామపక్షాలు అందుకున్నాయి.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ రాజకీయాలపై కీలక కామెంట్స్ చేశారు. పవన్ చర్యలతో జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమని తేల్చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలయికను తప్పు పట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక విషయంలో పవన్ అంచనాలను తప్పు అని వర్ణించారు. అదే జరిగితే కూటమి ఓటమి ఖాయమని.. బీజేపీ వల్ల ఓట్లన్నీ వైసీపీ వైపు టర్న్ అవుతాయని తేల్చేశారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఏకం అయితే అది జగన్ కు లాభం చేస్తుందని నారాయణ విశ్లేషించారు. పవన్ కోరుకున్నట్లుగా పొత్తు కుదిరితే అది జగన్ నెత్తిన పాలు పోయటమేనని వ్యాఖ్యానించారు.
అయితే అదే సమయంలో విపక్షాల కూటమి ఎలా ఉండాలో మాత్రం నారాయణ వెల్లడించలేదు. ఒక్క బీజేపీతో కలయికనే తప్పుపట్టినట్టు మాట్లాడారు. ఆ కూటమిలో వామపక్షాలకు చోటివ్వాలని అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఏపీలో జగన్ సర్కారుకు కేంద్ర సాయం దండిగా అందుతోందని గుర్తుచేశారు. కడప ఎంపీ అవినాశ్ విషయంలో సీబీఐ వ్యవహార శైలే తెలిసిపోతోందన్నారు. గవర్నర్ వ్యవస్థకు అనుకుంగా తెచ్చే ఆర్డినెన్సు కు రాజ్యసభలో మద్దతు కోసమే బిజెపి వివేకా కేసులో కేంద్రం సహకరిస్తోందని ఆరోపించారు. ఇదే తరహా ఘటన తమిళనాడు, కర్నాటక, కేరళలో అయితే కేంద్ర బలగాల సాయంతో అరెస్టలు చేసి ఉండేవారని గుర్తుచేశారు.
వచ్చే ఎన్నికల్లో విపక్షాల కట్టడికే రూ.2 వేల నోటు రద్దు అని నారాయణ గుర్తుచేశారు. రెండు వేల నో ట్ల ఉపసంహరణ కేవలం అధికార పక్షం నల్ల ధనాన్ని తెల్ల ధనం గా మార్చుకోవడానికేనని నారాయణ విశ్లేషించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు డబ్బు అందుబాటులో లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. లీగల్ గా మోడీ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారుని నారాయణ ఆరోపించారు. తెలుగు ప్రజలకు మొదటి శత్రువు బిజెపి, రెండో శత్రువు వైసిపి అని విమర్శించారు. విపక్ష కూటమి విషయంలో బీజేపీ స్థానంలో వామపక్షాలు ఉండాలని బలమైన ఆకాంక్షను బయటపెట్టారు. తాము సిద్ధంగా ఉన్నట్టు నారాయణ సంకేతాలిచ్చారు. ఇక చంద్రబాబు, పవన్ లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరీ.