హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భార్య, ఇద్దరు పిల్లల్లతో కలిసి ప్రదీప్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రదీప్, స్వాతి దంపతులు.. హైదరాబాద్లోని హస్తినాపురంలో నివాసముంటున్నారు. ప్రదీప్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. వారికి కళ్యాణ్(6), జయకృష్ణ(2) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, కొన్ని నెలలుగా ప్రదీప్ కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ఆ ఒత్తిడి తట్టుకోలేని ప్రదీప్ దంపతులు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారు. తాము మరణిస్తే.. తమ కుమారులు అనాథలవుతారని భావించి, వారిని కూడా ఆత్మహత్యలో భాగం చేశారు. నలుగురు ఒకేసారి పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయాన్ని గమనించిన ఇంటి యజమాని, విషయాన్ని స్థానికులకు, పోలీసులకు తెలియజేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో తమకు రూ.40 లక్షల వరకు అప్పు ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, స్వాతి తల్లిదండ్రులు మాత్రం ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని అంటున్నారు. తమ కుమార్తెతో గత ఆదివారం మాట్లాడినట్టు స్వాతి తండ్రి తెలిపారు. తొలుత పిల్లలు, భార్యకు విషమిచ్చిన ప్రదీప్.. తర్వాతే తాను సేవించినట్టు స్థానికులు చెబుతున్నారు. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని పేర్కొంటున్నారు.