IPL 2024: ఇటీవల హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్, గుజరాత్ జట్లు తలపడాల్సి ఉంది. అయితే వర్షం వల్ల ఆ మ్యాచ్ ను రద్దు చేస్తూ ఎంపైర్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. దీంతో మెరుగైన రన్ రేట్, పాయింట్లు కలిగి ఉండడంతో హైదరాబాద్ ప్లే ఆఫ్ వెళ్ళింది.. గుజరాత్ జట్టు నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక శనివారం రాత్రి చిన్న స్వామి స్టేడియంలో బెంగళూరు, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. ఒకానొక దశలో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది. ఇక ఆదివారం రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా మధ్య గుహవాటి వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.. వాస్తవానికి వర్షం కొంతసేపు తెరిపినివ్వడంతో ఎంపైర్లు టాస్ వేశారు. టాస్ నెగ్గిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత మళ్లీ వర్షం మొదలు కావడంతో.. ఎంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు.
వర్షం వల్ల లీగ్ దశలో దాదాపు మూడు మ్యాచ్ లు రద్దయ్యాయి. అప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు కావడంతో పెద్దగా ఇబంది లేకుండా పోయింది. ఒకవేళ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు కాకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఏకంగా జట్ల తలరాతలు మారేవి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాతావరణం చల్లగా మారుతుండడం.. వర్షాలు కురుస్తుండడంతో.. ప్లే ఆఫ్ మ్యాచ్ ల నిర్వహణ ఎలా అనే టెన్షన్ ఐపిఎల్ నిర్వాహక కమిటీని ఇబ్బంది పెడుతోంది. క్వాలిఫైయర్ -1, ఎలిమినేటర్ మ్యాచులు వర్షం వల్ల రద్దయితే విజేతను నిర్ణయించడం ఐపీఎల్ నిర్వాహక కమిటీకి తలనొప్పిగా మారుతుంది.
అహ్మదాబాదులోని నరేంద్ర మోడీ మైదానంలో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచులు జరగనున్నాయి. మే 21, 22 తేదీలలో ఈ మ్యాచ్లను నిర్వహిస్తారు. అయితే ఈ రెండు రోజులూ అక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారీగా వర్షాలు కురిస్తే మ్యాచ్ లు నిర్వహించడం దాదాపు అసాధ్యం..
అయితే ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్లే ఆఫ్ మ్యాచ్ ల నిర్వహణకు రిజర్వ్ డే అనేది ఉంది. ముందుగా నిర్ణయించిన రోజున మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే.. మరొక రోజు నిర్వహించేందుకు అదనపు సమయం అందుబాటులో ఉంది. ప్లే ఆఫ్ మ్యాచ్ లకైతే 120 నిమిషాల అదనపు సమయం ఉండగా.. లీగ్ మ్యాచ్ లకు ఇది 60 నిమిషాలుగా ఉంది. వర్షం వల్ల మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే, రిజర్వ్ డే రోజున మ్యాచ్ ఆడించే అవకాశం ఉంది.
ఉదాహరణకు రిజర్వుడే నాడు కూడా క్వాలిఫైయర్ -1 మ్యాచ్ వర్షం వల్ల నిర్వహణ సాధ్యం కాకపోతే.. అప్పుడు కోల్ కతా ఫైనల్ వెళ్తుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో ఆ జట్టు మొదటి స్థానంలో ఉంది. ఇదే సమయంలో ఎలిమినేటర్ మ్యాచ్ రద్దయితే రాజస్థాన్ ఫైనల్ లోకి ప్రవేశిస్తుంది. క్వాలిఫైయర్ -1 మ్యాచ్ హైదరాబాద్, కోల్ కతా జట్ల మధ్య జరుగుతుంది. మే 21న జరిగే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఫైనల్ వెళ్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్, బెంగళూరు తలపడతాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More