Pawan Bjp: ఇన్నాళ్లు మిత్రుడు.. ఇప్పుడు ఏపీ కోసం.. ఏపీ ప్రయోజనాల కోసం శత్రువుగా మారిపోతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజా ఆకాంక్షల కోసం కేంద్రంపై పోరాడక తప్పడం లేదు. ఏపీలో కలిసి సాగుతున్న బీజేపీ-జనసేన కాపురంలో ఇప్పుడు ‘విశాఖ ఉక్కు’ చిచ్చు పెట్టిందనే చెప్పాలి. దీంతో మొదలైన ఈ కలహాల కాపురం ఎటువైపు సాగుతుంది? వీరి మధ్య విభేదాలు వచ్చినట్టేనా? 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ ఎవరిదారి వారిదేనా? పవన్ బీజేపీ చేయి వదిలేసి ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి స్నేహ హస్తం చాచుతాడా? ఇలా ఎన్నో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీ బీజేపీతో కలిసి సాగుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కమలదళానికి గట్టి షాక్ ఇవ్వబోతున్నాడు. ఏపీలో వైసీపీకి గట్టి ప్రత్యామ్మాయంగా ఎదుగుతున్న జనసేనాని అడుగులు వ్యూహాత్మకంగా పడుతున్నాయి. ఏపీలో గెలవాలంటే వైసీపీకి ఎదురుగా నిలబడాలి. అదే సమయంలో ఏపీ ప్రజల్లో బీజేపీపై ఉన్న తీవ్ర వ్యతిరేకత నుంచి తమను తాము కాపాడుకోవాలి. అందుకే బీజేపీ తప్పులను ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.
విశాఖ ఉక్కు పోరాటాన్ని పవన్ కళ్యాణ్ తాజాగా ప్రారంభించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జనసేన వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అంతేకాదు.. పవన్ స్వయంగా విశాఖ స్టీల్ ఉద్యమం చేయడానికి అక్కడికి వెళుతున్నారు. ఇది ఖచ్చితంగా బీజేపీకి ఇబ్బంది కలిగించే వ్యవహారమే.
ఎందుకంటే పార్లమెంట్ లోనూ.. బయటా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించి తీరుతామని బీజేపీ పెద్దలు స్పష్టం చేశారు.ఇప్పుడు ఏపీలో బీజేపీతో కలిసి సాగుతున్న పవన్ ‘విశాఖ ఉక్కు’ కోసం ఉద్యమిస్తున్నారంటే అది బీజేపీతో కటీఫ్ చేయడమేనని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా బీజేపీ కొంపలు ముంచే డైలాగులు పేల్చితే వీరి మధ్య పొత్తు బంధానికి తెరపడవచ్చు.
దాదాపు 3 రోజుల పాటు విశాఖలో ఉండబోతున్న పవన్ తీరు ఇప్పుడు ఏపీ బీజేపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మిత్రుడు శత్రువుగా మారడం ఖాయమా? అన్న ఆందోళన బీజేపీలో నెలకొందట..