MS Dhoni- Washington Sundar: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 తొలి మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైంది. కానీ యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ మాత్రం ఆల్ రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. మిగతా బౌలర్ల కంటే భిన్నంగా ఆడి అందరి మనసులు దోచుకున్నాడు. 25 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకుని టీ20ల్లో టీమిండియా తరఫున ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సుందర్ అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
గతంలో దినేష్ కార్తీక్ 26 బంతుల్లో అర్ధ శతకం చేసిన రికార్డును ఇప్పుడు సుందర్ బ్రేక్ చేశాడు. సుందర్ నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి కేవలం 22 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. టీమిండియాకు విజయం చేజారినా సుందర్ ప్రతిభను మాత్రం అందరు ప్రశంసించారు. టీమిండియాకు మరో ఆల్ రౌండర్ దొరికాడని సంబరపడుతున్నారు. సోషల్ మీడియాలో సుందర్ ను ఆకాశానికెత్తుతున్నారు. సుందర్ ఇలా ఆడటానికి కారణం మాజీ సారధి మహేంద్రుడి సూచనల ఫలితమే అని కొనియాడుతున్నారు.
మ్యాచ్ కంటే ముందు ధోని మన ఆటగాళ్లను కలిసి వారికి కొన్ని సూచనలు చేశాడు. దీంతో సుందర్ వాటిని ఆసక్తిగా విని ఒంటపట్టించుకుని రాంచీలో జరిగిన మ్యాచ్ లో తన తడాఖా చూపించాడు. ఆటగాళ్లతో మాట్లాడిన ధోని సుందర్ తో ఎక్కువ సేపు మాట్లాడాడు. ఎలా బౌలింగ్ చేయాలి? బ్యాటింగ్ పై ఎలా పట్టు సాధించాలి? పిచ్ కండిషన్ ఏంటి అనే దానిపై కూలంకషంగా వివరించాడు. దీంతో సుందర్ ధోని సూచనలతో వైవిధ్యంగా ఆడి అందరి దృష్టి ఆకర్షించాడు. పదునైన వ్యూహాలతో తన ఆటతీరుకు పదును పెట్టుకున్నాడు.
బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్ములేపి ఆటపై పట్టు సాధించాడు. సాధారణ ఆటగాళ్లను సైతం స్టార్ ఆటగాళ్లను చేయడంలో ధోని పాత్ర ఎంతో ఉంది. దీంతో ధోని ఇచ్చిన కిక్ సుందర్ లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. తన ప్రతిభ ముందుకొచ్చింది. అన్ని అంశాల్లో తనదైన శైలిలో ప్రదర్శించిన సుందర్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అతడి ఆటతీరుతో ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. మ్యాచ్ ఓడినా అతడి సాహసం ఊరికే పోదని కితాబిస్తున్నారు. మొత్తానికి సుందర్ ఫామ్ లోకి రావడంతో టీమిండియాకు మరో మంచి ఆటగాడు దొరికినట్లు అయింది.