Global Investors Summit 2023: ఏదైనా పరిశ్రమను ఏర్పాటు చేయాలనుకుంటే దానికి తగ్గట్టు అనుకూల వాతావరణం ఉండాలి. అప్పుడే పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ఔత్సాహికులు ముందుకొస్తారు. కానీ ఏపీలో ఆ పరిస్థితి ఉందా? అంటే స్టయిట్ గా సమాధానం దొరకని పరిస్థితి. గత నాలుగేళ్లుగా పెట్టబడులు అని ఫీలింగ్ పెట్టుకున్న ప్రభుత్వం వాటంతట అవే వస్తాయని భావించింది. కానీ అలా జరగలేదు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏదో లాస్ అయ్యామన్న భావనకు ప్రభుత్వం వచ్చింది. పరిశ్రమలు వెల్లువలా వస్తాయని భావిస్తే.. ఉన్న పరిశ్రమలు ఉత్పత్తులను నిలిపివేశాయి. దీనికి మూల్యం తప్పదని భావించిన జగన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు శ్రీకారం చుట్టారు. ఒక విధంగా చెప్పాలంటే దీనిని చిత్తశుద్ధితో ఏర్పాటుచేస్తే మాత్రం సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేదు గత నాలుగేళ్లుగా డొల్ల కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్టు.. ఇప్పుడు కూడా ఎంవోయూలు చేసుకుంటే మాత్రం అంతకంటే దిగజారుడుతనం మరొకటి ఉండదు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2016, 17,18 లో వరుసగా కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో చంద్రబాబు విశాఖ సీఐఐ సదస్సులను ఏర్పాటుచేశారు. కానీ వీటిని సైతం నాటి విపక్షం వైసీపీ ఎగతాళి చేసింది. రోడ్డున పోయేవారిని తెచ్చి సదస్సుల్లో కూర్చోబెట్టినట్టు విమర్శలు చేశారు. దావోస్ వెళితే విహార యాత్రకు వెళ్లారంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు అదే దావోస్ కు ఎందుకు వెళ్లాలో తెలుసుకుంది. ఒకసారి వెళ్లి చేదు అనుభవం ఎదురయ్యేసరికి అక్కడ మైనస్ పది డిగ్రీల ఉష్ణోగ్రత అంటూ ఏవేవో కుంటిసాకులు చెప్పింది. నాడు రోడ్డున పోయే వారిని తెచ్చి సదస్సులు పెట్టారని ఆరోపించిన వారే తమంతట తాముగా సదస్సు నిర్వహణకు ముందుకు రావడం మార్పును తెలియజేస్తోంది. అయితే ఆ మార్పు తాలుకా ఫలితం ఏమిటన్నది పెట్టుబడులు బట్టి తెలుస్తుంది. పాత ఒప్పందాలతో సరిపెడతారా.. లేక కొత్తవేమైన చేస్తారా అన్నది చూడాలి.
రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే పారిశ్రామిక రంగం కీలకం. పెట్టబడులు వరదలా వస్తే కానీ అది సాధ్యం కాదు. కానీ గత నాలుగేళ్లుగా ఏపీలో పారిశ్రామిక పురోగతి లేదు. వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాధాన్యం మరి దేనికీ ఇవ్వలేదు. కొత్తగా పరిశ్రమలు నెలకొల్పేందుకు అవకాశమివ్వలేదు. అలాగని పాతవాటికి ప్రోత్సాహం కల్పించలేదు. అటు అమరావతి రాజధాని నిలిచిపోయింది. చెప్పుకోదగ్గ నగరం అంటూ ఏపీకి లేకుండా పోయింది. పెద్ద ఎత్తు పెట్టుబడులు ఆకర్షించాలంటే రాజధాని చాలా అవసరం. కానీ వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని లొల్లి పెట్టుకుంది. నాలుగేళ్లు కాలం కరిగిపోవడంతో ఇప్పుడు పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తోంది. అయితే నాడు డొల్ల కంపెనీలు అని విమర్శించిన నోట.. అవే కంపెనీలకు ఆహ్వానిస్తుండం మాత్రం అనుమానాలకు తావిస్తోంది.
టీడీపీ హయాంలో వచ్చాయి కాబట్టి తమ ఏలుబడిలో ఉండడానికి వీలులేదన్నట్టు వ్యవహరించారు. ఇప్పుడు రూ.50 కోట్లు ఖర్చుచేసి పెట్టుబడుల సదస్సుకు విశాఖను సిద్ధం చేస్తున్నారు. కానీ ఇటువంటి అంతర్జాతీయ సదస్సులు, ఈవెంట్లకు అవసరమైన కన్వెన్షన్ హాల్ కట్టేందుకు లూలూ సంస్థ ముందుకొచ్చింది. రూ.2500 కోట్లతో అంతర్జాతీయంగా తలమానికంగా విశాఖలో కన్వనెన్షన్ హాల్ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. పనుల ప్రారంభానికి సిద్ధమైంది. శంకుస్థాపన పూర్తయ్యింది. అయితే టీడీపీ హయాంలో వచ్చారని అనుమానాపు చూపులు చూడడం, హేళన చేయడంతో ఏపీ కాకపోతే మరోచోట కట్టుకుంటామంటూ లూలూ నిష్క్రమించింది. ఎప్పుడైతే ఏపీ ప్రభుత్వం ఇలా ఆలోచన చేసిందో అప్పటి నుంచి పారిశ్రామిక దిగ్గజాలు ఏపీ వైపు చూడడం మానేశారు. పరిశ్రమల ఏర్పాటు జాబితాలో ఏపీ నుంచి తప్పించేశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ సెజ్, హీరో సంస్థ ఇలా ఒకటేమిటి .. అన్ని పరిశ్రమలు ఏపీ నుంచి బయటకు వెళ్లిపోయాయి.
ప్రధానంగా రాయలసీమ లొకేషన్ బేసిస్ లో అనేక పరిశ్రమలు వచ్చాయి. కియా పరిశ్రమ ఏర్పాటైతే దాని చుట్టూ ఆటోమోబైల్ రంగమే విస్తరించే అవకాశం ఉంది. అటువంటి పరిశ్రమను ఏపీ నుంచి బలవంతంగా పంపించేశారన్న అపవాదు ఏపీ సర్కారుపై ఉంది. ఫ్యాక్షన్ చర్యలతో చాలా పరిశ్రమల యాజమాన్యాలకు ఇబ్బందిపెట్టారు. చివరకు కాంట్రాక్టర్లను సైతం అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి విపరీత, సంకుచిత మనస్తత్వాలతో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఏర్పడలేదు. సరికదా ఉన్న వాతావరణాన్నిచెడగొట్టారు. దీంతో పరిశ్రమలు ఏపీ ముఖం చూడడమే మానేశాయి. కేవలం రాజకీయ కోణంలో ఆలోచించే అమర్ రాజా పై కక్షసాధింపునకు దిగారు. దీంతో ఆ పరిశ్రమ రాయలసీమలో ఉత్పత్తులను తగ్గించింది. తెలంగాణ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించడంతో అటువైపుగా వెళ్లింది. దీంతో రాయలసీమ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమయ్యారు. అయితే ఈ నాలుగేళ్ల గమనాన్ని గుర్తించుకున్న జగన్ సర్కారు ఇప్పుడు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు సిద్ధమవుతోంది. చూడాలి మరీ ఇదెంతవరకూ వర్కవుట్ అవుతుందో.