Revanth Reddy : హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లోనూ సామాజిక విభజన చాలా ఏళ్ల క్రితమే జరిగింది. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల మేరకు కొన్ని సామాజిక వర్గాలు ఐక్యం కాగా, మరికొన్ని సామాజిక వర్గాలు తమకు రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్నాయి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలంటున్నాయి. కొన్ని సామాజిక వర్గాలు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినందున రిజర్వేషన్లే ఎత్తివేయాలని కోరుతున్నాయి. కానీ, రిజర్వేషన్లు ఎత్తేసే సాహసం ఎవరూ చేయడం లేదు. చేయరు కూడా అయితే ఇదే సమయంలో జనాభా ప్రాతిపదిక ర్వేషన్ల పెంపునకు కొందరు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, టీఎంసీ మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని ఎన్నికల్లో కులాలు, మతాల సమీకరణ రాజకీయ పార్టీలకు కీలకంగా మారుతోంది. ఓటర్లను ఈ పేరుతో విడగొట్టి.. అధికారంలోకి వస్తే ఇది చేస్తాం.. అదిచేస్తాం.. అని హామీలు ఇవ్వడంతోపాటు తాయిలాలు కూడా ఇవ్వడం సాధారణం అయింది. ఇలాంటి నేపథ్యం ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు చేసే వ్యాఖ్యలు కొన్ని సామాజికవర్గాలకు అనుకూలంగా, కొన్ని సామాజికవర్గాలు నొచ్చుకునేలా ఉంటాయి. తాజాగా తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇలాగే ఉన్నాయి. హెచ్ఐసీసీలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో కమ్మవారు అమ్మలాంటి వారని.. పంటలు పండే సారవంతమైన నేలలు ఎక్కడుంటే అక్కడ కమ్మవాళ్లు ఉంటారంటూ సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ఓ బ్రాండ్ అని తెలిపారు. దేశానికి సంకీర్ణ రాజకీయాలు నేర్పించారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ అంటే రెడ్లే..
కమ్మ సమ్మిట్లో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్తోపాటు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి. వాస్తవంగా తెలంగాణలో కమ్మ సామాజికవర్గం చాలా తక్కువ. జనాభాలో కేవలం 2 శాతానికి మించి ఉండరు. కమ్మలకు కేరాఫ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి రాష్ట్రంలో కమ్మలు చాలా వరకు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి ఇక్కడే సెటిల్ అయ్యారు. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం జిల్లాలోనే కమ్మలు ఎక్కువగా ఉంటారు. ఇక తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే రెడ్లే. ఈ పార్టీలో రెడ్డి సామాజిక వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. సీఎం పదవితోపాటు, మంత్రి పదవుల్లోనూ రెడ్డి సామాజికవర్గాలకే ఆ పార్టీలో ప్రాధాన్యం దక్కుతుంది. అలాంటి పార్టీలో ఉండి రేవంత్రెడ్డి కమ్మలను అమ్మలాంటి వారు అని కీర్తించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ కేబినెట్లో ఛాన్స్..
ఇక తెలంగాణలో కమ్మలు తక్కువగా ఉన్నప్పటికీ కేబినెట్లో మాత్రం ఆ సామాజికవర్గాలకు పదవులు దక్కుతున్నాయి. తెలంగాణ ఏర్పడి. కేసీఆర్ క్యాబినెట్లో పదేళ్లు పువ్వాడ అజయ్కుమార్కు మంత్రి పదవి దక్కింది. తాజాగా రేవంత్రెడ్డి క్యాబినెట్లో తుమ్మల నాగేశ్వర్రావుకు ఛాన్స్ దక్కింది. ఇక రేవంత్రెడ్డి క్యాబినెట్లో రెడ్లకు మంత్రి పదవులు దక్కాయి. సీఎం రేవంత్రెడ్డితోపాటు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. 12 మందిలో నలుగురు రెడ్డి సామాజికవర్గం వారే. ఇదిలా ఉంటే.. తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ కమ్మ సామాజికవర్గం ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గం నేతలకే టికెట్లు కేటాయిస్తున్నాయి. అదేవిధంగా కమ్మ ఓటర్లు తమ సామాజికవర్గం నేతలను గెలిపించుకుంటూ ఉనికిని కాపాడుకుంటున్నారు. ఈనేపథ్యంలో రేవంత్రెడ్డి కమ్మను కీర్తించడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.