Nallari Kiran Kumar Reddy: ఉమ్మడి ఏపీలో నల్లారి కుటుంబానిది ప్రత్యేక స్థానం. నల్లారి అమర్నాథ్ రెడ్డి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన హఠాన్మరణంతో కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. పూర్వపు వాయల్పాడు, ప్రస్తుత పీలేరు నియోజకవర్గాలను నల్లారి కుటుంబీకులు వరుసగా కైవసం చేసుకుంటూ వచ్చారు. ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2014 వరకు పీలేరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అయితే కిరణ్ రాజకీయ తప్పిదాలతో ఆ నియోజకవర్గాన్ని కోల్పోయారు. గత రెండు ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచారు.
ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి లో ఉన్నారు. ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి(Kishore Kumar Reddy) మాత్రం టిడిపిలో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలోనే కిషోర్ పేరు ఉంది. అయితే ఇక్కడ నల్లారి కుటుంబం పై సానుభూతి ఉంది. గత రెండు ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రజల నుంచి సానుభూతి వ్యక్తం అవుతోంది. ఆ సానుభూతితోనే ఎమ్మెల్యేగా గెలుపొందుతానని కిషోర్ కుమార్ రెడ్డి ఆశగా ఉన్నారు.పైగా ఇక్కడ జనసేనతో పొత్తు కలిసి వస్తుందని భావిస్తున్నారు. 15% వరకు బలిజ ఓటర్లు ఉన్నారు.అయితే ఇక్కడ నల్లారి కుటుంబాన్ని ఓడించాలని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు. కానీ ఆ స్థాయిలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేకపోవడం లోటే.
పీలేరు నియోజకవర్గంలో 1994 ముందు టిడిపి హవా నడిచింది. కానీ గత ఐదు ఎన్నికల్లో ఒక్కసారి కూడా టిడిపి గెలవలేదు. ప్రతి ఎన్నికల్లోను స్వల్ప మెజారిటీతో పీలేరు సీటు కోల్పోతూ వస్తోంది. నల్లారి అమర్నాథ్ రెడ్డి అకాల మరణంతో కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ రాజకీయాలు చేయడం ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలు కూడా ఆయనను ఆదరించారు. అయితే రాష్ట్ర విభజన పుణ్యమా అని నల్లారి కుటుంబీకులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సమైక్యాంధ్ర పార్టీ పేరుతో కిరణ్ సొంత పార్టీని ఏర్పాటు చేశారు. కానీ సొంత నియోజకవర్గంలో పీలేరులో విజయం సాధించలేకపోయారు. రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత నల్లారి సోదరులు రాజకీయంగా వేరుపడ్డారు. కిషోర్ టిడిపిలో చేరి ప్రత్యక్ష ఎన్నికలకు సై అంటున్నారు. కిరణ్ బిజెపిలో చేరినా ఆశించిన స్థాయిలో యాక్టివ్ గా లేరు.
పీలేరు నియోజకవర్గాల్లో ఆరు మండలాలు ఉన్నాయి. రెండున్నర లక్షలు వరకు ఓటర్లు ఉన్నారు. నల్లారి కుటుంబం పై ప్రజాభిమానం ఉంది. కిరణ్ సీఎంగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. గత ఎన్నికల్లో ఇక్కడ చింతల రామచంద్రారెడ్డి గెలుపొందారు. అయితే పెత్తనమంతా మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ది. అందుకే ఈసారి ఇక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. జనసేన తో పొత్తు కలిసి వచ్చేలా ఉంది. ఒకవేళ బిజెపితో పొత్తు కుదిరితే.. కిరణ్ నియోజకవర్గం లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. అదే జరిగితే కిషోర్ కు ఏకపక్ష విజయం వరించే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.