Jagan: ఏపీలో ఎన్నికలకు మరో నాలుగు నెలల వ్యవధి ఉంది. అప్పుడే పొలిటికల్ హిట్ నెలకొంది. వైసిపి నాయకత్వం పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడంతో రాజకీయ దుమారం రేగుతోంది. అధికార పార్టీ వ్యూహాలకు అనుగుణంగా టిడిపి, జనసేన పావులు కలపాల్సి వస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ బీసీ నినాదాన్ని తెరపైకి తేవడంతో.. విపక్షాలు సైతం అదే వ్యూహాన్ని అమలు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల నుంచి బలమైన బీసీ అభ్యర్థులను బరిలో దించాలని జగన్ భావిస్తున్నారు. దీంతో టీడీపీ కూడా మార్చాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.
ఇప్పటికే మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మార్చి బలమైన సంకేతాలను పంపించారు. అవసరమైతే సొంత సామాజిక వర్గాన్ని వదులుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు జగన్ స్పష్టం చేశారు.ఈ తరుణంలో సొంత సామాజిక వర్గం నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతున్నా జగన్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా విజయవాడ పార్లమెంటు స్థానానికి కొత్త ప్రయోగానికి తెర తీసినట్టు తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం వైసిపికి చిక్కలేదు. దీంతో ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు.
విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి ఈసారి బలమైన బీసీ అభ్యర్థిని బరిలో దించాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేశినేని నాని సోదరులలో ఒకరికి టిడిపి టికెట్ ఇవ్వనుంది. దీంతో జగన్ వారికి చెక్ చెప్పేలా రాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. టిడిపి సెల్ఫ్ గోల్ వేసుకునేలా ప్లాన్ చేశారు. పార్టీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త నెరుసు నాగసత్యం పేరును వైసీపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ఆయన వైపు దాదాపు మొగ్గు చూపినట్లు సమాచారం. ప్రస్తుతం నాగ సత్యం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడుగా ఉన్నారు. గతంలో ఆయన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఓల్డ్ టైం డైరెక్టర్ గా పని చేశారు. బీసీ అభ్యర్థి, ఆపై ఆర్థిక స్థితిమంతుడు కావడంతో నెగ్గుకు రాగలరని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని నిజమైన బీసీ అభ్యర్థి అయితే తమ స్వాగతిస్తామని.. కానీ కాల్ మనీ, సెక్స్ రాకెట్ ఆరోపణలు ఉన్న బీసీ నేత అయితే తాము ఒప్పుకోమని పరోక్షంగా బుద్దా వెంకన్నను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే జగన్ వ్యూహానికి తగ్గట్టు.. చంద్రబాబు బీసీ నేతను తెరపైకి తెస్తారా? లేకుంటే కేశినేని సోదరుల్లో ఒకరికి పోటీలో నిలుపుతారా అన్నది చూడాలి.