Kamareddy Master Plan Issue: కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు రెండేళ్ల క్రితం ఢిల్లీ సరిద్దుల్లో పెద్ద ఉద్యమమే చేశారు. ఏడాదిపాటు సాగిన ఉద్యమంలో కొంతమంది ప్రాణాలు వదిలారు. దీంతో కేంద్రం దిగివచ్చింది. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ దేశంలో రైతులకు క్షమాపణ చెప్పారు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు ఇటీవల పంజాబ్ వెళ్లి 300 రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల నుంచి పరిహారం ఇచ్చారు. తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోని కే సీఆర్.. పంజాబ్ రైతులపై మాత్రం ప్రేమ ఒలక బోయాడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. కన్న తల్లికి అన్నం పెట్టని వాడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్లు గా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
Kamareddy Master Plan Issue
రైతు ఏజెండాతో జాతీయ పార్టీ..
ఇదంతా ఓక ఎత్తయితే.. కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా మార్చారు. రైతు ఎజెండా నే తమ లక్ష్యమని పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రకటించారు. కేంద్రంలో వచ్చేది రైతు ప్రభుత్వమే అని పునరుద్ఘాటించారు. ఈ మేరకు జాతీయ స్థాయిలో రైతు సంఘాల ఏర్పాటు కూడా కసరత్తు మొదలు పెట్టారు. రైతులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో పార్టీ విస్తరణ పై దృష్టి పెట్టారు.
తెలంగాణ రైతుల ఉద్యమంపై మౌనం..
దేశంలోని రైతుల కోసం పార్టీ పెట్టానని చెప్పుకుంటున్న కేసీఆర్ సొంత రాష్ట్రం తెలంగాణలో రైతుల పడుతున్న ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టుల కింద వేల ఎకరాల భూములను తీసుకున్న ప్రభుత్వం ఇప్పటివరకు చాలామందికి పరిహారం ఇవ్వడం లేదు. తాజాగా కామారెడ్డి మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ పేరుతో రైత్ర భూములు లాక్కునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్ణయమే. తమ భూముల లాక్కుంటే ఎట్లా బతకాలని రెండు నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్నారు. అయినా దీనిపై మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇప్పటివరకు స్పందించలేదు. బుధవారం కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతు ఆత్మహత్య చేసుకోవడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గురువారం కుటుంబ సమేతంగా కలెక్టరేట్ ముట్టడి తలపెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. దీంతో తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారుల తీరును తప్పుపట్టారు. మరోవైపు రైతులు కలెక్టర్ బయటకు వచ్చి తమ గోడు వినాలని డిమాండ్ చేశారు. అయినా కలెక్టర్ బయటకు రాలేదు. దీనికి నిరసనగా రైతులు కలెక్టర్ దిష్టిబొమ్మ దహనం చేసి వెళ్లిపోయారు.
Kamareddy Master Plan Issue
అయినా స్పందించని కేసీఆర్..
ఎక్కడో పంజాబ్ హర్యానాలో రైతులు చనిపోతే వారిపై సానుభూతి చూపిన కేసీఆర్ గత ఎన్నికల్లో తన కూతురు ఎంపీగా పోటీ చేసిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి రైతులు ఉద్యమిస్తున్న నోరు మెదపలేదు. కనీసం ఆత్మహత్య చేసుకున్న రైతు కు నివాళులర్పించలేదు. ఆదుకుంటామని ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు. తమది రైతు ప్రభుత్వం అని కేంద్రంలో రైతు సర్కార్ చెబుతున్న కేసీఆర్ సొంత రాష్ట్ర రైతులపై వివక్ష చూపడం విమర్శలకు తావిస్తోంది. రైతుబంధు రైతు బీమా ఇచ్చి తాము ఏం చేసినా చెల్లుతుంది అని కెసిఆర్ ఆలోచన కామారెడ్డి రైతుల ఉద్యమంతో చెదిరిపోయింది. ఇప్పటికైనా స్పందించకుంటే ఎన్నికల ఏడాదిలో కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.