Jagan
Jagan: లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో వైసీపీని బిజెపి ఎందుకు ఆశ్రయించినట్లు? ఎందుకు మద్దతు కోరినట్టు? ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దాటినావైసిపి అవసరం ఏంటి? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో బలమైన చర్చగా మారింది. కేవలం వైసీపీకి లిఫ్ట్ ఇచ్చేందుకే బిజెపి పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చారా? లేకుంటే చంద్రబాబు తోక జాడించకుండా ఉండేందుకా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే కేంద్ర రాజకీయాల్లో వైసీపీ ది ఇప్పటికీ చెరగని ముద్ర. ఇంకా ఆ పార్టీకి పార్లమెంటులో 15 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో 11 మంది, లోక్సభలో నలుగురు ఉన్నారు. కీలక సమయంలో వీరి అవసరం చాలా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే టిడిపితో సమానంగా వైసిపికి బలం ఉంది. టిడిపికి 16 మంది ఎంపీలు ఉంటే.. వైసీపీకి 15 మంది ఎంపీలు ఉన్నారు. టిడిపికి 43% ఓటు బ్యాంకు ఉంటే.. వైసీపీకి 40 శాతంఓటింగ్ ఏపీలో ఉంది. ఈ పరిణామాలన్నీ గమనించి కేంద్ర పెద్దలు జగన్ కు స్నేహ హస్తం అందించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తు రాజకీయం కోసమే బిజెపి అగ్ర నేతలు జగన్ ను ఒక ఆప్షన్ గా ఉంచుకున్నట్లు విశ్లేషిస్తున్నారు.
వైసీపీ శ్రేణులు ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంతటి ప్రజాదరణ ఎటు వెళ్లి పోయిందని బాధపడుతున్నాయి. అయితే ప్రజల్లో తమ ఇమేజ్ చెక్కుచెదరలేదని.. కేవలం ఆ మూడు పార్టీల పొత్తు వల్లే సీట్లు కోల్పోయామని ఒక నిర్ణయానికి వస్తున్నారు. 2029లో మరోసారి సత్తా చాటుదామని చెబుతున్నారు. కానీ అధినేత పై కేసులు, పార్టీ శ్రేణులపై ఉక్కు పాదం వంటివి ఉక్కిరి బిక్కిరి చేస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో కేంద్రం వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ అందించింది. అసలు అవసరమే లేకున్నా లోక్ సభ స్పీకర్ ఎన్నికకు వైసిపి మద్దతు కోరింది బిజెపి. ఇది భవిష్యత్ రాజకీయాలకు నాంది అని.. ఏపీ విషయంలో బిజెపి ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోందని తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. వరుసగా ఐదు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేడీ ఈసారి దెబ్బతింది. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఆ పార్టీ ఓటమి పాలయ్యింది. బిజెపితో రహస్య పొత్తు సాగించిన నవీన్ పట్నాయక్ తో పాటు జగన్ కూడా ఓడిపోయారు. అదే సమయంలో ఒడిస్సాలో నేరుగా బిజెపి అధికారంలోకి వచ్చింది. ఏపీలో తాను భాగస్వామ్యమైన కూటమి గెలుపొందింది. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ఒడిస్సా ప్రయోజనాల కోసం బిజెపికి మద్దతు ఇస్తే.. తిరిగి బిజెపి తన పార్టీని కబళించిందని నవీన్ బాధపడుతున్నారు. ఇక కాషాయ పార్టీని తమ ప్రత్యర్థిగా భావిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతోనే బిజెపి అలెర్ట్ అయ్యింది. జగన్ కు స్నేహ హస్తం అందించింది.
రాజ్యసభలో బిజెపికి బలం అంతంత మాత్రమే. గత ఐదు సంవత్సరాలుగా అవసరం వచ్చిన ప్రతిసారి జగన్ తో పాటు నవీన్ పట్నాయక్ మద్దతు ఇచ్చారు. వైసిపి తో పాటు బీజేపీకి రాజ్యసభలో ఎక్కువ సంఖ్య బలం ఉంది. ప్రస్తుతం వైసీపీకి ఏకంగా 11 మంది ఎంపీలు ఉన్నారు. అందుకే వైసీపీ అవసరం బిజెపికి ఉంది. అందుకే బిజెపి అగ్రనేతలు లైన్లోకి వచ్చారు. నేరుగా జగన్ కు ఫోన్ చేశారు. లోక్సభ స్పీకర్ కు మద్దతు పేరిట స్నేహ హస్తం అందించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. వైసీపీకి 40 శాతం మంది ప్రజలు జై కొట్టారు. అందుకే ఆ పార్టీతో భవిష్యత్తు రాజకీయం చేయాలని బిజెపి ఒక ఆప్షన్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ సుస్థిరతకు చంద్రబాబు ఇబ్బంది పెట్టని వరకు వారి స్నేహానికి డోకా లేదు. ఒకవేళ ఇబ్బంది పెడితే మాత్రం వైసీపీకి కావలసిన అన్ని వనరులను బిజెపి సమకూర్చుతుంది. మొత్తానికైతే కష్టాల్లో ఉన్న జగన్ కు బిజెపి అగ్ర నేతల భరోసా లభించినట్లు అయ్యింది.