Kalyana Lakshmi
Kalyana Lakshmi: రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కల్యాణలక్ష్మి, షాదీముబార్ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థికసాయం అందించింది. 2023 నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంతకు ముందే పెళ్లి చేసిన పేదింటి తల్లిదండ్రులు ఈ పథకాల కింద సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటికి సంబంధించిన చెక్కులు మంజూరయ్యాయి. అయితే వాటిని పంపిణీ చేయడంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోంది. దీంతో చెక్కుల ఎక్స్పైరీ తేదీ ముంచుకొస్తోంది. ఈ నెలాఖరులోగా చెక్కులు పంపిణీ చేయకుంటే అవి చెల్లకుండా పోతాయని ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హైకోర్టును ఆదేశించారు. చెక్కుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ జరిపిన కోర్టు.. చెక్కుల పంపిణీని అడ్డుకోవడాన్ని తప్పు పట్టింది. చెక్కుల పంపిణీలో జాప్యానికి కారణాలతో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
చెక్కుల పంపిణీకి చర్యలు..
ఇది అటు తిరిగి.. ఇటు తిరిగి తమకు చుట్టుకుంటుందేమో అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం చెక్కుల పంపిణీకి చర్యలు చేపట్టింది. ఈ నెలాఖరుతో గడువు ముగిసే చెక్కులు పంపిణీ చేయాలని అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కూడా చెక్కులు పంపిణీ చేస్తామని కోర్టుకు తెలియజేశారు. గడువు ముగిసే 71 చెక్కులు ఇప్పటికే లబ్ధిదారులు బ్యాంకుల్లో జమ చేశారని వెల్లడించారు. చెక్కులు ల్యాప్స్ అవకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
ఆగస్టు 27 వరకు గడువు..
ఇదిలా ఉండగా, చెక్కుల ల్యాప్స్ తేదీలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వేసిన పిటిషన్ వాస్తవం కాదని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఆగస్టు 27 వరకు చెక్కుల గడువు ఉందని పేర్కొన్నారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల చక్కుల పంపిణీకి సంబంధించిన వివరాలను అందించడానికి, వివరణాత్మక కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల గడువు ఇవ్వాలని ఇమ్రాన్ఖాన్ సమయం కోరారు.