Lashkar-e-Taiba: పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు తమను తాము రక్షించుకోవడానికి కూడా కష్టపడుతున్నాయి. లష్కర్–ఎ–తోయిబా (ఎల్ఈటీ) లాంటి సంస్థ ఒకప్పుడు భారత్పై దాడులకు ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు ఆ సంస్థలోనే భయం వ్యాపించింది. వారి స్వంత నాయకుల మాటల్లోనే ఈ వాస్తవం బయటపడుతోంది.
భారత్ దెబ్బను అంగీకరించిన ఆపరేషన్స్ చీఫ్..
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరిగిన ఒక కీలక సమావేశంలో లష్కర్–ఎ–తోయిబా ఆపరేషన్స్ డెప్యూటీ చీఫ్ రిజ్వాన్ హనీఫ్ మాట్లాడారు. ఆ ప్రసంగం గూఢచారి వర్గాలకు అందడంతో ఇప్పుడు చర్చ జరుగుతోంది. అందులో ఆయన స్పష్టంగా చెప్పిన మాటలు ముఖ్యం. అజ్ఞాత సాయుధుల చేతిలో ఇప్పటివరకు 30 మంది కీలక లష్కర్ నాయకులు మరణించారని ఆయన అంగీకరించారు. ఇది కేవలం వార్తల స్థాయిలో ఉన్న విషయం కాదు. సంస్థలోని సీనియర్ నాయకుడే దీన్ని ధవీకరించడం పాక్ ఉగ్రవాద వర్గాల్లో ఆందోళనకు నిదర్శనం.
కార్యకలాపాలకు బ్రేక్..
హనీఫ్ మాటల ప్రకారం, భారత్లోకి చొరబాట్లు, ఉగ్రవాదుల ఎంపిక, శిక్షణ, సమన్వయం వంటి మొత్తం వ్యవస్థ దెబ్బతిన్నది. లష్కర్ను నిషేధించిన తర్వాత పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఎఎఫ్ఎఫ్) పేరుతో కార్యకలాపాలు కొనసాగించే ప్రయత్నం చేశారు. కానీ అది కూడా ఇప్పుడు సాధ్యం కావడం లేదని ఆయనే చెప్పారు. పెషావర్, రావల్పిండి, రావాలాకోట్, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా అజ్ఞాతుల దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాద మూలాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ చర్యల వల్ల సంస్థకు భారీ నష్టం జరుగుతోందని ఆయన అంగీకరించారు.
మారిన వ్యూహం..
మూడు–నాలుగేళ్లుగా ఉగ్రవాదులు చిన్న వ్యాపారాలు చేస్తున్నట్లు, మసీదుల్లో మౌలానాలు, ఇమామ్లుగా కనిపిస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే దాడులు చేసే వ్యూహానికి మారారు. అజ్ఞాత సాయుధుల భయంతో నాయకులు బయటకు రావడానికి కూడా సంకోచిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మౌలానా మసూద్ అజర్ కుటుంబ సభ్యులు 14 మంది మరణించిన సంఘటన కూడా ఇక్కడ గుర్తించాలి. పరిహారం తీసుకుని ఆయన సైలెంట్గా ఉండటం, బయటకు రాకపోవడం – ఇవన్నీ ఒత్తిడి పెరిగిన సంకేతాలు.
భారత్ ఎఫెక్ట్..
భారత్ ఉగ్రదాడులకు ప్రతీకారంగా పాక్ భూభాగంలోనే లక్ష్యాలను ఎంచుకుంటున్న విధానం ఈ ఫలితాలను తీసుకొచ్చింది. లష్కర్ వంటి సంస్థలు ఇప్పుడు తమ కార్యకలాపాలను సాధారణంగా కొనసాగించలేకపోతున్నాయి. నాయకులు దాగి ఉండాల్సి వస్తోంది. పాక్ ఉగ్రవాద సంస్థలు ఈ అజ్ఞాత సాయుధులను భారత ఆపరేషన్గా అనుమానిస్తున్నాయి. ఈ అనుమానం మరింత భయాన్ని పెంచుతోంది. ఫలితంగా వారు రక్షణాత్మక వైఖరి తీసుకుంటున్నారు.
ఒకప్పుడు భయం పుట్టించిన లష్కర్–ఎ–తోయిబా ఇప్పుడు తానే భయపడుతోంది. సొంత నాయకుల నోటినుంచి వెలువడిన ఈ మాటలు పాక్లోని ఉగ్రవాద నెట్వర్క్పై భారత వ్యూహం సృష్టించిన ఒత్తిడిని స్పష్టం చేస్తున్నాయి. ఉగ్రవాద మూలాలను లక్ష్యంగా చేసుకున్న చర్యలు కొనసాగుతున్నంత కాలం ఈ ఆందోళన మరింత పెరగడం అనివార్యం.