AP Election Survey
AP Election Survey: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీలో ఎన్నికల నగారా మోగనుంది. గెలుపు కోసం అన్ని రాజకీయ పక్షాలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. అస్త్ర శాస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. తమదే గెలుపు అని నమ్మకం పెట్టుకున్నాయి. ఈ తరుణంలో మరో సర్వే వెలుగులోకి వచ్చింది. ఏపీలో ఏ పార్టీకి బలం ఉందన్నది తేల్చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి అత్యధిక స్థానాలు దక్కుతాయో అన్న విషయం స్పష్టంగా చెప్పుకొచ్చింది. అదే సమయంలో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని కూడా ప్రకటించింది.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి నడవాలనుకుంటున్నాయి. వైసిపి మాత్రం ఒంటరి పోరుకే సిద్ధమవుతోంది. బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు ఎవరితో జత కడతాయో ఎన్నికల ముంగిట తేలనుంది. ప్రస్తుతానికి టిడిపి, జనసేన కూటమి కడతాయని తెలుస్తోంది. అందులో బిజెపి చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వై నాట్ 175 అన్న నినాదంతో వైసిపి ముందుకు సాగుతోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ ఏపీ పై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అటు వామపక్షాలు సైతం బిజెపిని విడిచిపెడితే టిడిపి, జనసేన కూటమి వైపు వచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. ఇటువంటి తరుణంలో వస్తున్న సర్వేలు సంచలనం సృష్టిస్తున్నాయి.
తాజాగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ పోల్ స్కాన్ పేరుతో సర్వే చేపట్టింది. డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి ఉందని తెలుసుకునే ప్రయత్నం చేసింది. మొత్తం 2లక్షల 57 వేల శాంపిళ్లను సేకరించింది. ప్రభుత్వ పాలన, ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గ స్థితిగతులు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న ఈ సంస్థ ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించింది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఈ సర్వే చేసినట్లు చెప్పుకొస్తోంది
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సర్వే తేల్చి చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 113 నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉందని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఆ స్థానాల్లో గెలుపొందడం ఖాయమని స్పష్టం చేసింది. 46 నియోజకవర్గాల్లో వైసీపీకి ఓటమి తప్పదని తేల్చేసింది. మరో 16 నియోజకవర్గాల్లో వైసీపీకి, టిడిపి, జనసేన కూటమికి బిగ్ ఫైట్ ఉంటుందని తేల్చి చెప్పింది. 50.10 శాతం ఓట్లతో వైసిపి ముందంజలో ఉంటుందని.. 43.12 శాతం ఓట్లతో టిడిపి జనసేన తరువాత స్థానంలో నిలుస్తాయని చెప్పుకొచ్చింది. ఇక జాతీయ పార్టీలు అయిన బిజెపి, కాంగ్రెస్ లు టు పాయింట్ జీరో ఎయిట్ శాతానికి పరిమితమవుతాయని ఈ తాజా సర్వే తేల్చేసింది. వైసీపీ విజయం ఖాయమని సర్వే చెప్పడంతో.. ఆ పార్టీ శ్రేణులు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.