YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి కాపుల అంశాన్ని ఒక రాజకీయ రణరంగంగా మార్చాలని జగన్ భావించారు. కానీ ఆ ప్రయత్నం వికటించి.. చివరకు సొంత పార్టీలోనే నిప్పు పెట్టబోతోందని సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీ లైన్ దాటి వైసిపి కాపు నేతలు వ్యవహరిస్తుండడం ఇప్పుడు హార్ట్ టాపిక్ అవుతోంది. ప్రధానంగా కాపు రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వైసిపి కాపు నేతలే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి పార్టీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుండడం విశేషం.
* ముద్రగడ సంస్మరణ సభలో..
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ జరిగింది. అయితే సభకు హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా.. చాలా జాగ్రత్తగా మసులుకున్నారు నేతలు. ఇప్పుడు హఠాత్తుగా కాపు రిజర్వేషన్ల అజెండాను భుజానికి ఎత్తుకోవడం వెనుక సొంత పార్టీపై తిరుగుబాటు అన్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన ఆర్థిక వెనుకబాటు రిజర్వేషన్లను కాపులకు నిలిపివేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే కాపు రిజర్వేషన్లను ప్రస్తావించడం ద్వారా తమ అధినేత చేసిన తప్పిదాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు.
* అప్పట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు..
2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ల హామీ ఇచ్చారు చంద్రబాబు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయనందున ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. అది పతాక స్థాయికి చేరుకోవడంతో చంద్రబాబు ప్రభుత్వం కాపులకు ఐదు శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్లను కేటాయించింది. కాపులు ఆర్థికపరమైన పథకాలను సొంతం చేసుకున్నారు. అయితే ఆ రిజర్వేషన్లను అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశారు జగన్ మోహన్ రెడ్డి. రిజర్వేషన్లు అనేది కేంద్రం పరిధిలోని అంశం అని.. అది తన వల్ల కాదు అని తేల్చి చెప్పారు. అయితే అప్పట్లో ఏ కాపు నేత కూడా దానిని వ్యతిరేకించలేదు. కాపుల్లోకి ఇది బలంగా వెళ్లడంతో 2024 ఎన్నికల్లో విపరీతమైన ప్రభావం చూపింది.
* పార్టీ లైన్ దాటి..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు రిజర్వేషన్ల విషయం ప్రస్తావించారు. కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది జగన్ వైఖరికి పూర్తి భిన్నం. మరోవైపు కాపు ఐక్యత సభకు సంబంధించి టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావుకు మద్దతు తెలిపారు తోట త్రిమూర్తులు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డిలో అసహనం రేపుతోంది. అయితే కాపుల పేరుతో జగన్ ఆడిన రాజకీయ క్రీడా ఇప్పుడు రివర్స్ గేర్ లో ఆయనకి దెబ్బ కొడుతోంది.







