YSR Congress party: అనుమానం పెనుభూతం.. ఇది వ్యక్తిలో ఉంటే సంసారం నాశనం అవుతుంది. వ్యవస్థలో ఉంటే సమాజం మొత్తం నాశనం అవుతుంది. అలాగే ఒక పార్టీలో ఉంటే చెప్పాల్సిన పనిలేదు.. దాని ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు వైసిపి స్వయంగా అనుభవిస్తోంది.
అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో వ్యవస్థలను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుంది వైసిపి. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో రకరకాల రాజకీయ వ్యూహాలు చేస్తోంది. కాకపోతే ఇవి నవ్వు తెప్పిస్తున్నాయి. ఇలాంటి ధోరణి వల్ల క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఉన్న పార్టీని వీడి వెళ్లిపోలేక.. కొత్త పార్టీలో ప్రవేశించలేక అవస్థలు పడుతున్నారు. ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిష్టానం కనీసం స్పందించడం లేదు. పైగా ఎటువంటి వ్యూహ చతురతను రాజకీయంగా చూపించడం లేదు.
ఉత్తరాంధ్రలో ఇటీవల మజ్జి శ్రీను అనే నాయకుడు టిడిపిలో చేరారు. దీంతో ఆ ప్రాంతంలో అత్యంత కీలకమైన నాయకుడైన బొత్స సత్యనారాయణ కన్నీరు పెట్టుకున్నారు. మజ్జి శ్రీనుకు అనుకూలంగా ఉన్న నాయకులు మొన్నటిదాకా వైసీపీలోనే ఉన్నారు. వారిని అధిష్టానం పక్కనపెట్టింది. వారు కోవర్టు రాజకీయాలు చేశారని వైసీపీ అధిష్టానం అనుమానం. అందువల్లే వారిని పక్కన పెట్టింది.
కేవలం వారు మాత్రమే కాదు విజయసాయిరెడ్డి.. సామినేని ఉదయభాను.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇలా అనేకమంది నాయకులను వైసీపీ అధిష్టానం బయటికి పంపించింది. వారు టిడిపికి అనుకూలంగా ఉన్నారని.. ఆరోపణలు చేస్తూ వారి మీద సొంత మీడియాలో నెగిటివ్ వార్తలు ప్రసారం చేయించింది. అంతేకాదు, వారిని దూరం పెట్టింది. సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో కొనసాగుతున్నారు.
వాస్తవానికి ఒక నాయకుడి మీద వైసిపి అధిష్టానానికి అనుమానం కలిగితే నెగటివ్ ప్రచారం మొదలుపెడుతుంది. వారిని మెడపట్టి బయటికి గెంటివేస్తుంది. షర్మిల నుంచి మొదలు పెడితే విజయసాయి రెడ్డి వరకు ఇదే విధానం కొనసాగింది. అయితే వైసీపీలో ఇప్పుడున్న నాయకులు ఏదో ఒక రూపంలో కేసులు ఎదుర్కొంటున్నవారే. కానీ ఇంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కసారి కూడా జైలుకు వెళ్లి రాలేదు. కనీసం ఒక కేసు కూడా ఆయన మీద నమోదు కాలేదు. ఈ ప్రకారం చూసుకుంటే రామకృష్ణారెడ్డి కూటమినేతలతో అంట తాగుతున్నారా.. ఇదే ప్రశ్నను విజయసాయిరెడ్డి వ్యక్తం చేశారు . కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఆ స్థాయిలో చర్యలు తీసుకునే ధైర్యం జగన్ కు ఉంటుందా.. అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అధిష్టానానికి అనుమానం అనేది మైండ్లో ఉంటే.. ఎంతటి నాయకుడినైనా సరే బయటికి పంపిస్తుందనేది రూడీ అవుతోంది.