Rahul Gandhi: ఒక బలమైన వ్యక్తిని ఢీకొట్టాలి అంటే మన దగ్గర అంతకుమించిన బలం ఉండాలి. లేదా అదే స్థాయిలో చాకచక్యం ఉండాలి. రెండు లేనప్పుడు వాటిని పొందుపరచుకోవాలి. కానీ ఈ విషయంలో రాహుల్ గాంధీ నేర్చుకోడు. ఓటముల నుంచి గుణ పాఠాలను వంట పట్టించుకోలేడు. అందువల్లే కాంగ్రెస్ పార్టీకి ఈ దురవస్థ.
2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎందులో కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. కొన్ని సందర్భాలలో ప్రభావం చూపించే అవకాశం వచ్చినప్పటికీ రాహుల్ గాంధీ చేతులారా వాటిని దూరం చేసుకున్నాడు. పైగా నరేంద్ర మోడీని మరింత బలమైన వ్యక్తిగా మార్చాడు. ప్రజాస్వామ్య సూత్రికరణ ప్రకారం బలమైన ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం మరింత బలపేతం అవుతుంది. వ్యవస్థలు.. వ్యక్తులు అధికార పక్షానికి అండగా ఉన్నంతవరకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం దేశంలో నరేంద్ర మోడీ ఏకచత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నారు అంటే అందుకు పరోక్ష కారణం కూడా రాహుల్ గాంధీనే. అధికారపక్ష తప్పులను.. విధాన లోపాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు బయట పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది.. పైగా 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గతానికంటే భిన్నంగా సీట్లను సాధించింది. అయినప్పటికీ ఆ స్థాయిని నిలుపులేకపోయింది. ఇప్పటికీ అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ చిన్నచిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నదంటే దాని దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..
ఇక తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాత్రోంకి గూంజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు రాహుల్ గాంధీ. ఈ కార్యక్రమానికి ప్రముఖ యూట్యూబర్.. స్టాండప్ కమెడియన్ పులకిత్ మణి హాజరయ్యారు. నరేంద్ర మోడీని అనుకరించారు. ఆయన లాగే మాట్లాడారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించారు. ఇది చూసేందుకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది ఓట్లు తెప్పించే మార్గం కాదు. వాస్తవానికి విద్యార్థులతో సమావేశం నిర్వహిస్తున్నప్పుడు గత పరిణామాలను కూడా ఒకసారి రాహుల్ గాంధీ పరిశీలించుకోవాలి. ఒకరకంగా చెప్పాలంటే ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ.. కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో ఉద్యోగాల భర్తీ కోసం విద్యార్థులు రోడ్లమీదకి ఎక్కినప్పుడు అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి.
వెనుకటి కాలంలో అంటే ఇది బయటకు తెలిసేది కాదు. అప్పట్లో మీడియా కూడా అధికార పక్షానికి తలవంచేది. ఇప్పుడు సోషల్ మీడియా బలోపేతమైంది.. ఇలాంటి స్థితిలో రాహుల్ గాంధీ విద్యార్థుల సమస్యల మీద రోడ్లమీదకి రావడం నిజంగా హాస్యాస్పదం. పైగా వారి సమస్యలు పరిష్కరిస్తానంటూ హామీ ఇవ్వడం మరింత వైపరీత్యం. తన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రజల సమస్యలు.. యువత సమస్యలు పరిష్కరించి.. రోడ్డుమీదికి వచ్చి బిజెపిని ప్రశ్నిస్తే బాగుంటుంది. అలాకాకుండా తమ రాష్ట్రాలలో విద్యార్థుల మీద లాఠీచార్జి చేసి.. అధికారం లేని రాష్ట్రాలకు వచ్చి బిజెపి మీద విమర్శలు చేస్తే జనం నవ్వుకుంటారు. అసలే ఇది సోషల్ మీడియా కాలం. ప్రతిదీ రికార్డెడ్..
BJP-RSS के system को students नहीं, अंधभक्त चाहिए। pic.twitter.com/wzZVh1bFo0
— Rahul Gandhi (@RahulGandhi) September 19, 2026