Nellore Mahanadu: నెల్లూరులో మహానాడు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తొలిసారిగా మహానాడు వేడుకలు ఈ జిల్లాలో జరుగుతుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వాస్తవానికి శ్రీకాకుళంలో ఈసారి మహానాడు వేడుకలకు ప్లాన్ చేశారు. కానీ ఉత్తరాంధ్రలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. జూన్లో కానీ.. జూలైలో కానీ ఈ వేడుక జరగనుంది. అయితే ప్రధాని పర్యటన నేపథ్యంలో నెలరోజులు ముందుగానే మహానాడు లాంటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం పద్ధతి కాదు అని టిడిపి హై కమాండ్ భావించింది. అందుకే అప్పటికప్పుడు మహానాడు వేదికను నెల్లూరుకు మార్చింది. సహజంగానే నెల్లూరులో టిడిపి నేతలు అంతా సమన్వయంతో ఉన్నారు. అందుకే అక్కడ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారిగా మహానాడు నిర్వహణ బాధ్యతలు రావడంతో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు.
* టిడిపి క్లీన్ స్వీప్
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మొన్నటి వరకు పట్టు తక్కువ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది నెల్లూరు జిల్లా. 2014 ఎన్నికల్లో స్వీప్ చేసింది ఆ పార్టీ. 2019లో మాత్రం అదే పరిస్థితి కొనసాగింది. తెలుగుదేశం పార్టీకి దారుణ పరాజయం తప్పలేదు. 2024 లో మాత్రం టిడిపి విజయం సాధించింది ఏకపక్షంగా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి పెద్ద నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. అందుకే అక్కడ టిడిపి బలపడింది. భారీ మెజారిటీతో గెలిచింది. అదే పట్టును కొనసాగించాలన్న ఉద్దేశంతో మహానాడు నిర్వహణ బాధ్యతలను ఆ జిల్లా నేతలకు కట్టబెట్టారు.
* హేమహేమీలు..
అయితే వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా ఉన్నారు. నారాయణ మంత్రిగా కొనసాగుతున్నారు. మరో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నారు. వీరందరికంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా దూకుడుగా ఉన్నారు. అందుకే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. మహానాడు వేదికకు సంబంధించిన భూమి పూజ కూడా పూర్తి చేశారు. పదుల సంఖ్యలో యంత్రాలతో చదును చేసే పనుల్లో ఉన్నారు. దాదాపు 2200 ఎకరాల్లో మహానాడు సభ కొనసాగనుంది. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు మహానాడు జరగనుంది.. తొలి రెండు రోజులు 25వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. చివరి రోజు మాత్రం ఏడు లక్షల మంది జనాభా వస్తారని అంచనా. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు తో పాటు పరిసర పట్టణాలు, ప్రాంతాల్లో లాడ్జిలు, ఫామ్ హౌస్ లను బుక్ చేశారు పార్టీ నేతల కోసం. ఇక కార్యక్రమానికి వచ్చే వారికి పసందైన విందు ఇచ్చేందుకు నెల్లూరు పెద్దారెడ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మర్యాద ఎలా ఉండాలో.. అలా ఉండేలా ప్రణాళిక రూపొందించారు.