Stree Shakti Scheme : ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి పై దృష్టి పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను దాదాపు అమలు చేసింది. ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి అప్పుడే ఏడాది పూర్తి చేసుకుంది.. స్త్రీ శక్తి పేరుతో ప్రారంభించిన ఈ పథకం గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభం అయింది. ఈరోజుతో ఏడాది పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ స్త్రీ శక్తికి ఏడాది – రెట్టింపైన ఆత్మగౌరవం’ పేరుతో వేడుకలు ఘనంగా నిర్వహించింది. సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాజధాని లోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా సీఎం క్యాంపు కార్యాలయం వరకు మహిళలతో కలిసి ముఖ్యమంత్రి బస్సుల్లో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో మహిళల యోగక్షేమాలు, కుటుంబ స్థితిగతులను ఆరా తీశారు. అనంతరం వారితో కలిసి తేనేటి విందులో కూడా పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి హాజరైన మహిళలతో సీఎం చంద్రబాబు ఆత్మీయంగా మాట్లాడారు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* విజయవంతంగా తొలి ఏడాది..
కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను అమలు చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం స్త్రీ శక్తి దిగ్విజయంగా ఒక ఏడాది పూర్తి చేసుకుంది. ఈ పథకం ద్వారా గడిచిన ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో మహిళలు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగించారు. రోజుకు ప్రభుత్వం రూ.8.53 కోట్ల వరకు ఆర్టిసి రాయితీ భరించినట్లు, గణాంకాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో 9978 బస్సులు ఉన్నాయి. అందులో 7631 బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలవుతోంది. ఈ లెక్కన మొత్తం ఆర్టీసీలోని 76% బస్సులో ఈ పథకం అమలు చేస్తున్నారు. ఏడాది పూర్తి చేసుకోవడంతో బ్లాక్ బస్టర్ పథకంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

* మహిళల ఆనందం..
మహిళల జీవితాలకు సంబంధించి ఈ పథకం ఎంతగానో దోహదం చేసింది. ప్రధానంగా మత్స్యకార మహిళలు, ప్రైవేటు ఉద్యోగాలు చేసే మహిళలు, విద్యార్థినులకు ఎంతో మేలు చేసింది. మహిళల ఆర్థిక అభివృద్ధికి, కుటుంబ జీవనానికి ఎంతో దోహదం చేసినట్లు ఈరోజు సీఎం చంద్రబాబు తో మహిళలు చెప్పడం విశేషం. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం వల్ల తమకు నెలకు 1500 రూపాయలు ఆదా అవుతోందని నంద్యాలకు చెందిన మహిళ చెప్పారు. ఉద్యోగులకు ఈ పథకం వల్ల ఉపయోగకరం అని ఓ యువతి హర్షం వ్యక్తం చేసింది. అయితే స్త్రీ శక్తి పథకం అప్పుడే ఏడాది పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. కూటమి 2024 జూన్ లో అధికారంలోకి వచ్చింది. 2025 ఆగస్టులో ఈ పథకం ప్రారంభం అయింది. అయితే ఎన్నెన్నో విమర్శలు చేసిన విపక్షాలు.. అసలు ఈ పథకం అమలు చేయలేదని వ్యక్తం చేసినా అనుమానాలు పటా పంచలు చేస్తూ.. పథకం దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప పరిణామం.
