Vande Mataram Controversy : వందేమాతరం.. ఈ మూడక్షరాల నినాదం బ్రిటిష్ పాలనలో దేశమంతటినీ ఏకం చేసింది. తెల్లదొరల తుపాకీ గుళ్లకు, లాఠీ దెబ్బలకు బెదిరిపోకుండా వీధివీధినా ప్రతిధ్వనించిన స్ఫూర్తి గీతమిది. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా కాంగ్రెస్ వేదికలపై గానం చేసిన ఈ గేయం.. దశాబ్దాల తరబడి స్వాతంత్ర్య సమరయోధులకు గుండె ధైర్యమై నిలిచింది. కానీ నాటి మహత్తర సమరంలో అందరినీ ఏకం చేసిన ఈ గీతం.. నేడు రాజకీయ, మతపరమైన వివాదాలకు కేంద్రబిందువుగా మారడం నిజంగా విచారకరం.
వందేమాతరం ఆవిర్భావం.. ఉద్యమ స్ఫూర్తి
1870ల కాలంలో బంకిం చంద్ర ఛటర్జీ రాసిన ‘వందేమాతరం’ (తల్లికి ప్రణామాలు) గేయం, తరువాత ఆయన రాసిన ‘ఆనంద్ మఠ్’ నవలలో భాగమైంది. 1905 నాటి బెంగాల్ విభజన సమయంలో స్వదేశీ ఉద్యమానికి ఇది ఒక ప్రధాన ఆయుధంగా మారింది. భారతదేశాన్ని ఒక పవిత్ర మాతృమూర్తిగా (భారతమాతగా) రూపకల్పన చేస్తూ రాసిన ఈ గీతం, ఆనాడు ఏ ఒక్క కులానికో, మతానికో పరిమితం కాలేదు. ప్రతి భారతీయ పౌరుడిలో దేశభక్తి జ్వాలను రగిలించింది. బాలగంగాధర్ తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహానాయకులు ఈ నినాదాన్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లారు.
వివాదానికి మూలాలు ఎక్కడ?
ఈ వివాదం నిన్న మొన్నటిది కాదు.. దీని మూలాలు 1930ల కాలంలోనే ఉన్నాయి. వందేమాతరం గేయంలోని మొదటి రెండు చరణాలు కేవలం ప్రకృతికి, మాతృభూమి సౌందర్యానికి నమస్కరించేలా ఉంటాయి. అయితే తరువాతి చరణాల్లో మాతృభూమిని ‘దుర్గ’, ‘లక్ష్మి’, ‘సరస్వతి’ వంటి హిందూ దేవతలతో పోలుస్తూ వర్ణనలు వస్తాయి. ఏకేశ్వరోపాసన పాటించే ముస్లిం లీగ్ నాయకులు, మాతృభూమిని దైవంగా పూజించడం తమ మత విశ్వాసాలకు ఇస్లామిక్ సిద్ధాంతాలకు విరుద్ధమని భావించారు.
1937 కాంగ్రెస్ రాజీ: ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రవీంద్రనాథ్ ఠాగూర్ సలహాతో ఒక నిర్ణయానికి వచ్చింది. మాతృభూమి వర్ణన మాత్రమే ఉన్న మొదటి రెండు చరణాలను మాత్రమే అధికారికంగా పాడాలని, తరువాతి చరణాలను మతపరమైన భావనలకు వదిలేయాలని తీర్మానించింది.
నేటి రాజకీయాల్లో వందేమాతరం
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ‘జనగణమన’ను జాతీయ గీతంగా , ‘వందేమాతరం’ను జాతీయ గేయంగా రాజ్యాంగ సభ గుర్తించింది. రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. అయినప్పటికీ, వివిధ రాజకీయ శక్తుల లబ్ధి కోసం ఈ గీతం మళ్లీ మళ్లీ వివాదాల్లోకి లాగబడుతోంది.
ఒకవైపు వందేమాతరం పాడటం ప్రతి భారతీయుడి ప్రాథమిక బాధ్యత అని, దీనిని వ్యతిరేకించడం దేశభక్తి లేకపోవడమేనని కొన్ని వర్గాలు వాదిస్తాయి. మరోవైపు నిర్బంధంగా పాటపాడించడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని, కొన్ని రాజకీయ పార్టీలు తమ సైద్ధాంతిక వైఖరిని ప్రదర్శించేందుకు ఈ వివాదాన్ని వాడుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి.
దేశభక్తి అనేది అంతరంగానికి సంబంధించినది. ఏ ఆచారాలు, ఏ మత విశ్వాసాలు ఉన్నప్పటికీ, స్వాతంత్ర్య పోరాటంలో మన పూర్వీకులు రక్తం చిందించిన తీరును, వారి త్యాగాలను స్మరించుకోవడానికి వందేమాతరం ఒక ఐక్యతా చిహ్నం. మాతృభూమి పట్ల గౌరవాన్ని, మత విశ్వాసాలను వేర్వేరు కోణాల్లో అర్థం చేసుకుంటూనే, వివాదాలను పక్కనబెట్టి ఈ అమూల్యమైన వారసత్వాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
దేశభక్తిని చాటే వందేమాతరం పై ఎందుకింత వివాదం? దీనిపై ‘రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.