Homeఆంధ్రప్రదేశ్‌Chiranjeevi: ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ పై సంచలన వీడియో రిలీజ్ చేసిన చిరంజీవి

Chiranjeevi: ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ పై సంచలన వీడియో రిలీజ్ చేసిన చిరంజీవి

Chiranjeevi: రాజకీయాలు వద్దంటూనే మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రకటన చేశారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళలో ఆయన చేసిన ఈ కీలక ప్రకటన పొలిటికల్ సర్కిల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఏపీలో మెగా అభిమానులకు, ప్రజలకు చిరంజీవి స్పష్టమైన సంకేతాలు పంపించారు. కొద్ది రోజుల కిందట తనను కలిసిన కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులను చిరంజీవి ఆశీర్వదించారు. వీరిద్దరినీ గెలిపించాలని ఆ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందే జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం అందించారు. తద్వారా మెగా అభిమానులు జనసేనతో పాటు కూటమికి అండగా నిలవాలని పరోక్ష సంకేతాలు పంపించారు. అయితే ఇప్పుడు ఏకంగా ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు.

ఇప్పటికే పవన్ కు మద్దతుగా మెగా కాంపౌండ్ వాల్ నుంచి వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ రంగంలోకి దిగారు. పిఠాపురంలో ప్రచారం కూడా చేశారు. మరోవైపు బుల్లితెర నటులు సైతం పిఠాపురంలో చుట్టేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెగాస్టార్ అభిమాన సంఘాల్లో యాక్టివ్ గా ఉన్నవారు పిఠాపురం చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కనీసం పవన్ కళ్యాణ్కు లక్ష ఓట్ల మెజారిటీ తెప్పించాలన్న ఆలోచనతో వారు పని చేస్తున్నారు. ఇప్పటివరకు మెగాస్టార్ కుటుంబాన్ని పొలిటికల్ ఫెయిల్యూర్స్ గా చూపించే ప్రయత్నం జరిగింది. దానిని అధిగమించేందుకు ఇప్పుడు యావత్ కుటుంబం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చిరంజీవి ఈ కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. మొన్నటికి మొన్న కూటమి అభ్యర్థులను ఆశీర్వదిస్తేనే వైసీపీ నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు నేరుగా చిరంజీవి రంగంలోకి దిగడం సాహసంతో కూడుకున్న పని అని చెప్పాలి. ఇన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి.. కేవలం పవన్ కళ్యాణ్ కోసమే ఇప్పుడు రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు.’ అమ్మ కొడుకుల ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి. మేలు జరగాలి అనే విషయంలో ముందుంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడిది. ఎవరైనా అధికారంలోకి వచ్చేక ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు.

కానీ పవన్ కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టాడు. సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందించాడు. మత్స్యకారులకు సాయం చేయడం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాలని అనిపిస్తోంది. ఏ తల్లి కైనా తన కుమారుడు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ అన్న కైనా తను తమ్ముడు అవస్థలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఒకే మాట చెప్పా. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ల బిడ్డల కోసం, వారి భవిత కోసం చేసే యుద్ధం ఇది అన్నాను. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉంటే మంచి వాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని నమ్మి జనం కోసం జనసైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రాష్ట్ర భవిష్యత్తు కోసం శక్తిని వినియోగించాలి అంటే చట్టసభల్లో అతని గొంతును మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ను గెలిపించాలి. మీకు సేవకుడిగా, సైనికుడిగా, అన్నయ్యగా అండగా నిలబడతాడు. మీకోసం కలబడి మీ కలలను నిజం చేస్తాడు’ అంటూ చిరంజీవి ఈ వీడియోలో స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సంకేతాలు పంపారు. అయితే ఇది ఒక్క పవన్ కళ్యాణ్ కోసం కాదని.. కూటమి గెలుపు కోసమని.. అందుకే పోలింగ్నకు ఐదు రోజుల ముందు చిరంజీవి రంగంలోకి దిగారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే చిరంజీవి సంచలన ప్రకటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అంశంగా మారిపోయింది.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular