Chiranjeevi: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారని , ప్రభుత్వం ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపిందని , చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించాడు అంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. టీడీపీ అనుకూల మీడియా కూడా ఈ వార్త పై ప్రత్యేక కథనాలు క్రియేట్ చేయడం తో , అభిమానులు నిజమేనేమో అని నమ్మారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే , తమ్ముడు చేపట్టిన పధకాలను అన్నయ్య ప్రమోట్ చేయబోతున్నాడు అంటూ ఎలివేషన్స్ కూడా వేసుకున్నారు. అయితే సోషల్ మీడియా విస్తృతంగా జరుగుతున్న ఈ ప్రచారం పై చిరంజీవి టీం కాసేపటి క్రితమే ఒక క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని కొట్టి పారేసింది.
చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారని , ఎలాంటి రాజకీయ సంబంధాలు పెట్టుకోవడం ప్రస్తుతం ఆయనకు ఇష్టం లేదని, సోషల్ మీడియా లో జరిగే ప్రచారాలను నమ్మొద్దని , ఏదైనా ఉంటే అధికారికంగా తెలియజేస్తామని, ఇలాంటి అసత్య ప్రచారాలను అభిమానులు దయచేసి గమనించాలని , ఇతరులకు ఇలాంటి వార్తలు షేర్ చేయకండి అంటూ చెప్పుకొచ్చింది చిరంజీవి టీం. దీంతో గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా లో చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ అంటూ జరుగుతున్న సుదీర్ఘ ప్రచారానికి బ్రేక్ పడింది. గతం లో కూడా చిరంజీవి పై ఇలాంటి ప్రచారాలు చాలానే జరిగాయి. ఆయన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున రాజ్య సభ కి పంపబోతున్నాడని కొన్ని మీడియా చానెల్స్ ప్రసారం చేశాయి. అంతే కాదు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే గవర్నర్ చిరంజీవి అంటూ ప్రచారం కూడా జరిగింది. వీటిల్లో ఎలాంటి నిజం లేదని స్వయంగా చిరంజీవి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
పదే పదే నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు అని చిరంజీవి క్లారిటీ ఇస్తున్నప్పటికీ కూడా , ఎవరు ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం తన ద్రుష్టి మొత్తాన్ని సినిమాల వైపే ఉంచాడు. ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం బాబీ తో ఒక సినిమా చేస్తున్నాడు. ‘వాల్తేర్ వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత , వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.