Operation Sindoor: గతేడాది ఏప్రిల్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ మే నెలలో ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇది భారత–పాకిస్తాన్ సైనిక చరిత్రలో ఒక మలుపు తిప్పిన సంఘటన. ఈ ఆపరేషన్ కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడంతోనే ఆగలేదు. అది పాకిస్తాన్ వైమానిక, రాడార్, ఎయిర్బేస్ నెట్వర్క్ను తీవ్రంగా దెబ్బతీసింది. ఏడాది దాటినా ఆ దాడుల ఫలితాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఇటీవల రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా తాజాగా వెల్లడించిన విషయాలు ఈ విజయం వెనుక ఉన్న వ్యూహాత్మక లెక్కలను మరింత స్పష్టం చేశాయి.
పాక్ ఎయిర్బేస్లపై దీర్ఘకాలిక ప్రభావం
ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్లోని కీలక ఎయిర్బేస్లు, కమాండ్ సెంటర్లు, రాడార్ వ్యవస్థలు లక్ష్యంగా మారాయి. భారత్ వైపు నుంచి జరిగిన కచ్చితమైన దాడులతో అనేక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏడాది తర్వాత కూడా పూర్తి స్థాయి పునరుద్ధరణ జరగలేదని, తాత్కాలిక మరమ్మతులతోనే కొనసాగుతున్నాయని సమాచారం. ఇది పాకిస్తాన్ వైమానిక దళం సాధారణ కార్యకలాపాలను, సమీకరణ సామర్థ్యాన్ని దీర్ఘకాలంగా ప్రభావితం చేస్తోంది. యుద్ధం తర్వాత కూడా ఈ నష్టం కొనసాగడం, భారత్ పటిష్టమైన సామర్థ్యాన్ని సూచిస్తుంది.
దెబ్బతీసిన ఎస్–400..
రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఆపరేషన్ సమయంలో వెస్టర్న్ ఎయిర్ కమాండ్ను నడిపించారు. ఇటీవల తెలిపిన విషయాలు ఎస్–400(సుదర్శన చక్రం) పాత్రను కేంద్రంగా ఉంచాయి. భారత్ ఎస్–400 వ్యవస్థలను పాకిస్తాన్ సరిహద్దును కవర్ చేసే విధంగా మోహరించినట్లు చెప్పారు. దీంతో పాక్ వైపు నుంచి వచ్చే డ్రోన్లు, మిస్సైళ్లు, విమానాలు భారత భూభాగంలోకి ప్రవేశించకముందే ఛేదించబడ్డాయని తెలిపారు. ఎస్–400 ఓపెన్ చేయడంతో పాకిస్తాన్ వైమానిక కార్యకలాపాలు తీవ్రంగా పరిమితమయ్యాయి. వారి యుద్ధవిమానాలు సరిహద్దుకు దగ్గరగా రాలేకపోయాయి. పాకిస్తాన్ ఈ వ్యవస్థలను గుర్తించి దెబ్బతీయాలని అనేక ప్రయత్నాలు చేసిందన్నారు. గూఢచర్యం, స్లీపర్ సెల్స్, ఉపగ్రహ సహాయం వంటి మార్గాలు వాడింది. కానీ వాటిని గుర్తించడంలో విఫలమైందని తెలిపారు. ఇది భారత్ యొక్క ప్లానింగ్, మోహరింపు, రక్షణ చర్యలు ఎంత సమర్థవంతంగా ఉన్నాయో చూపిస్తుంది. మిశ్రా ప్రకారం, ఇది పరిపూర్ణ ప్రణాళికతోనే సాధ్యమైంది. ఆపరేషన్ తర్వాత ఆయనను కేంద్రంసర్వోత్తమ యుద్ధ సేవా మెడల్తో సత్కరించింది.
వ్యూహాత్మక ఆధిక్యం..
ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్ను ఊహించని విధంగా దెబ్బకొట్టింది. ఉగ్రవాద శిబిరాలపై దాడులతోపాటు, తర్వాతి దశల్లో సైనిక లక్ష్యాలపై కూడా కచ్చితమైన దాడులు జరిగాయి. డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీలు, ఇటీవలి వెలుగులోకి వచ్చిన సమాచారం ఈ ఆపరేషన్ యొక్క లోతును, సాంకేతిక ఆధిక్యాన్ని వివరిస్తున్నాయి. అణ్వాయుధాలకు సంబంధించిన కొన్ని సమాచారం కూడా చర్చల్లో ఉంది, కానీ అధికారికంగా ధ్రువీకరించడం లేదు. జరిగిన నష్టాన్ని బయటకు చెప్పుకోలేని స్థితిలో పాకిస్తాన్ ఉంది. ముఖ్యమైన అంశం ఏమిటంటే, భారత్ తన భూభాగం నుంచే దాడులు నిర్వహించి, పాక్ ప్రతిస్పందనను నియంత్రించగలిగింది. ఎస్–400 వంటి వ్యవస్థలు ఈ ఆధిక్యాన్ని సాధ్యం చేశాయి. పాకిస్తాన్ తన వైమానిక నిఘా సామర్థ్యాన్ని కోల్పోయి, ప్రతిస్పందనలకే పరిమితమైంది.
ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక సైనిక చర్య కాదు. అది భారత్ కొత్త రెడ్లైన్స్ను, సాంకేతిక సామర్థ్యాన్ని, వ్యూహాత్మక సహనాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్కు మిగిలిన నష్టం, ఎయిర్బేస్ల పునరుద్ధరణ ఆలస్యం, వైమానిక పరిమితులు ఈ ఆపరేషన్ దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతోంది. ఎస్–400 వంటి వ్యవస్థలు కేవలం రక్షణ కాకుండా, శత్రువు యొక్క కదలికలను నియంత్రించే సాధనంగా మారాయి.