YCP BJP Relations: బిజెపి విషయంలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ మారుతున్నట్లు అర్థం అవుతోంది. ఢిల్లీ వర్గాల్లో సైతం ఇది చర్చకు దారితీస్తుంది. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా ఆలోచనతో అడుగులు వేస్తున్నట్లు స్పష్టమౌతోంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పెంపును నిరసిస్తూ ఆందోళనలు, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఓటమికి ఆయన విశ్లేషిస్తున్న కారణాలు.. భారతీయ జనతా పార్టీకి కోపం తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిజెపిని నమ్ముకుంటే రాజకీయంగా తనకు ఇబ్బందులు తప్పవని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి బలంగా ఉన్న నేపథ్యంలో.. తనకు జాతీయస్థాయిలో ఏదో ఒక కూటమి అండ ఉండాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది ఢిల్లీ వర్గాల్లో. ఈ విషయం బిజెపి పెద్దల వరకు తెలియడంతో వారు సైతం జగన్మోహన్ రెడ్డి విషయంలో సాఫ్ట్ కార్నర్ విడిచి పెట్టే పరిస్థితి కనిపిస్తోంది.
* బిజెపి గెలుపు పై సందేహం..
ఏపీలో ప్రత్యేక ఓటరు సవరణ చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. రాజకీయ ప్రత్యర్థుల ఓట్లను తొలగించడమే దీని వెనుక ఉన్న ఎత్తుగడ అని చెబుతున్నారు జగన్. బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమికి ఓటరు జాబితా సవరణ కారణం అని తేల్చి చెప్పారు. తద్వారా బిజెపి గెలుపును తప్పుపట్టారు. ఎన్నికల సంఘం నిర్ణయాలను సైతం ఎత్తిచూపుతున్నారు. మొన్నటికి మొన్న డీజిల్ పెట్రోల్ ధర పెంపు పై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. పశ్చిమ ఆసియా పరిణామాల క్రమంలో పెంపు అనివార్యం అని తెలిసి కూడా.. ఇలా ఆందోళనలు చేయడం ఏంటనేది బిజెపి పెద్దల ప్రశ్న. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి బిజెపితో కటీఫ్ చెప్పేందుకే నిర్ణయించినట్లు తెలుస్తోంది.
* మరో కూటమి అండ కోసం..
ప్రస్తుతం ఏపీలో కూటమి బలంగా ఉంది. పైగా మూడు పార్టీల మధ్య సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపిని నమ్ముకుంటే ఇబ్బందులు అని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్రమేపి కాంగ్రెస్ పెద్దలతో ఆయన రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు కూడా ప్రచారం ఉంది. తమిళనాడులో విజయ్ గెలుపుతో దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక రాజకీయ శక్తిగా అవతరించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరిలో వచ్చిన ఈ మార్పుతో బిజెపి పెద్దలు సైతం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వైసిపి తో పాటు జగన్ విషయంలో సాఫ్ట్ కార్నర్ తగ్గించుకోవాలని పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
