YSR Statue: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక వీరాభిమాని. ఆ కుటుంబమంతా ఆ పార్టీ మద్దతు దారులే. కానీ ఉన్నట్టుండి ఆయన వైయస్సార్ విగ్రహానికి నల్ల రంగు పూశారు. అయితే ఈ ఘటనకు పాల్పడింది ఎవరు అనే దానిపై లోతుగా చర్చ జరిగింది. ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు పోలీసుల దర్యాప్తులో సొంత పార్టీ నేత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెలుగు చూసింది. ఇంతకీ సొంత మనిషి ఎందుకీ పని చేశాడు అంటే.. 16 కోట్ల రూపాయల మోసానికి గురికావడమే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నడిబొడ్డున జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
* రెండు రోజుల కిందట ఘటన..
ఆళ్లగడ్డలో ఈనెల 17న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తి నలుపు రంగు పూయడం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. వైయస్సార్ విగ్రహం ముఖానికి చుట్టిన బనియన్ పై జగన్, వైసీపీ నేత మల్లికార్జున రెడ్డి ఫోటో ఉన్నట్లు గుర్తించారు. అదే బనియన్ పై ఎర్రటి అక్షరాలతో వైఎస్ఆర్సిపి వాళ్లు 16 కోట్ల ఆస్తిని మోసం చేశారు. న్యాయం కావాలి అని రాసి ఉంది. దాని ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆళ్లగడ్డ మండలం పి చింతకుంట కు చెందిన సిద్ధం రెడ్డి రమణారెడ్డి ఈ ఘటనకు పాల్పడ్డారని నిర్ధారించారు. అదుపులోకి తీసుకున్నారు.
* న్యాయం జరగకపోవడంతో..
తాను ఎందుకు ఈ ఘటనకు పాల్పడింది సిద్ధం రెడ్డి రమణారెడ్డి పోలీసుల దర్యాప్తులో చెప్పేసాడు. రమణారెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేసేవారు. ఆళ్లగడ్డ వైసిపి నేతలు మల్లికార్జున్ రెడ్డి, లోకేశ్వర రెడ్డి సోదరులతో రమణారెడ్డి తండ్రి ఓ సంస్థను ఏర్పాటు చేశారు. కొన్నాళ్ళకు దానిని విక్రయించి భూమిని కొన్నారు. తరువాత ఆ భూమిని విక్రయించి పెట్టి పెట్టిన పెట్టుబడులకు అనుగుణంగా వాటాలు పంచుకున్నారు. అయితే ఈ వాటాల విషయంలో రమణారెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగింది. వైసిపి ముఖ్య నేతల వద్ద పంచాయతీ జరిగినా న్యాయం జరగలేదు. అందుకే తనకు న్యాయం చేయలేదని ఉద్దేశంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నల్ల రంగు పూసినట్లు నిందితుడు రమణారెడ్డి అంగీకరించారు. అతడి బ్యాగులో సుత్తి, సెల్ఫోన్, జగన్మోహన్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి ఫోటోలు కలిగిన టీ షర్ట్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తనకు న్యాయం చేయాలని గతంలోనే రమణారెడ్డి తాడేపల్లి వెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారట. ఆయన పట్టించుకోకపోవడంతో విజయసాయిరెడ్డి, గంగుల భానుమతి, అప్పటి ఎమ్మెల్యేలు కాటసాని రామ్ రెడ్డి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డిని సంప్రదించిన న్యాయం జరగలేదు. వైసిపి కేంద్ర కార్యాలయం ఎదుట జగనన్న న్యాయం కావాలి అంటూ మైకులో ప్రచారం చేశారు కానీ పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఈ పరిణామాల క్రమంలోనే తాను రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నల్ల రంగు పూసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అయితే వైసీపీ మాత్రం దీనిని ఒక రాజకీయ కుట్ర కోణంలో చూపించాలన్న ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కావడంతో మౌనం దాల్చింది.
View this post on Instagram