BC Reservations: తెలుగుదేశం పార్టీ.. ఈ పేరు చెబితేనే వెనుకబడిన తరగతుల వారు గుర్తొస్తారు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా.. నవ్యాంధ్రప్రదేశ్లోనైనా బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం. ఎంతోమంది రాజకీయంగా అందలం ఎక్కారు టిడిపి వల్ల. తెలుగుదేశం పార్టీ నిర్ణయాల వల్ల. ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాదిమంది నాయకులు తయారయ్యారు. అందుకే బీసీలు ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప.. తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ వచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి బీసీ నినాదం వెనుక టిడిపిని దెబ్బ కొట్టాలన్న వ్యూహం ఉండేది. కానీ ఇప్పుడు అంతకుమించి బ్రహ్మాస్త్రాలను బయటకు తీశారు చంద్రబాబు. బీసీల సామాజిక, రాజకీయ అభ్యున్నతి కోసం మూడు చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను పెంచారు.
* అప్పట్లో గుర్తించిన ఎన్టీఆర్..
తెలుగుదేశం పార్టీని 1982లో ప్రకటించారు నందమూరి తారక రామారావు. కానీ అప్పటికే దశాబ్దాల కాలంగా పరిపాలన చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్ల పుణ్యం తో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు గా మారారు ఎస్సి, ఎస్టీలు. కానీ బీసీలకు అండగా ఏ పార్టీ లేదు. అందుకే అప్పట్లోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు నందమూరి తారక రామారావు. బీసీలకు రిజర్వేషన్లు మొదలుపెట్టారు. బీసీ నాయకత్వాన్ని సమర్థించారు. బీసీల అభ్యున్నతికి పాటుపడుతూ కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రారంభించారు. దారిద్రియ రేఖకు దిగువనున్న వారికి రేషన్ కార్డులు అందించి.. కిలో బియ్యాన్ని రెండు రూపాయలకు ఇవ్వడం ప్రారంభించారు. రాజకీయంగాను వందలాది మంది నేతలను ప్రోత్సహించారు. ఎమ్మెల్యేల గాను, మంత్రులు గాను అవకాశం కల్పించారు. నాడు ఎన్టీఆర్ వేసిన బీసీ పునాది ఇప్పటివరకు పని చేస్తూ వస్తోంది. దానిని కొనసాగింపుగా ఇప్పుడు చంద్రబాబు చారిత్రాత్మకంగా స్థానిక సంస్థల్లో సైతం బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
* మళ్లీ రిజర్వేషన్ల పెంపు..
ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రకటన చేశారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం. రాష్ట్ర జనాభాలో 50.14% బీసీలు ఉన్నారు. అటువంటి వారికి 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం అనేది శుభపరిణామం. 1986లో ఎన్టీఆర్ తొలిసారిగా బీసీలకు స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించారు. జిల్లా పరిషత్తులతో పాటు మండల ప్రజాపరిషత్తులను అందుబాటులోకి తెచ్చారు. 1995లో చంద్రబాబు సీఎం అయ్యారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారు. 2001, 2006, 2013 స్థానిక సంస్థల ఎన్నికలు ఆ రిజర్వేషన్ల ప్రాతిపదికనే జరిగాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 76 ద్వారా బీసీల రిజర్వేషన్లను 24. 15% తగ్గించారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 16,800 మంది బీసీలు రాజకీయ పదవులు కోల్పోవాల్సి వచ్చింది. అప్పట్లో బీసీల పేరుతో రకరకాలుగా ప్రచారం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్. కానీ ఇప్పుడు టిడిపి కూటమి సర్కార్ మాత్రం ఏకంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.