Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: బీజేపీతోనే వైసీపీ.. టీడీపీతో వద్దు.. పవన్ ఏం చేయనున్నారు?

Pawan Kalyan: బీజేపీతోనే వైసీపీ.. టీడీపీతో వద్దు.. పవన్ ఏం చేయనున్నారు?

Pawan Kalyan: ఏపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలో వైసీపీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అవసరమైతే వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకుండా బీజేపీని ఒప్పించి టీడీపీని కలుపుకుపోవడానికి జనసేన ఆవిర్బావ సభ సాక్షిగా ప్రతినబూనారు. పవన్ ఒకటి తలిస్తే.. కేంద్రంలోని బీజేపీ మరొకటి తలుస్తోంది. వైసీపీని పవన్ ఎంతగా ద్వేషిస్తుంటే.. బీజేపీ మాత్రం ఆ పార్టీతో రాసుకుపూసుకు తిరగడాన్ని జనసైనికులు జీర్ణించుకోవడం లేదు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలోని అధికార వైసీపీ మద్దతు తీసుకుంది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్ లో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి స్వయంగా పాల్గొని బలపరిచారు.

కేంద్రంలోని బీజేపీ పెద్దలు వైసీపీతో సాన్నిహిత్యంగా మెలుగుతున్నారు. వైసీపీ కూడా అంతే.. బీజేపీకి అవసరమైన బిల్లులు, రాష్ట్రపతి ఎన్నికలకు వచ్చేసరికి సీఎం జగన్ భేషరతుగా మద్దతిస్తూ అండగా నిలుస్తున్నారు. నమ్మకమైన మిత్రపక్షంగా మసులుకుంటున్నారు. ఈ పరిణామమే జనసేనాని పవన్ కళ్యాణ్ ను డిఫెన్స్ లో పడేలా చేస్తోంది.

బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వగానే ఏపీలో రంగంలోకి దిగుతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ ఆ రూట్ మ్యాప్ తేడా కొట్టిందని ప్రచారం సాగుతోంది. బీజేపీ ఇచ్చిన రూట్ మ్యాప్ లో 2024 ఎన్నికలను వదిలివేయాలని.. 2029 ఎన్నికలపై దృష్టి సారించాలని ఉందని సమాచారం. జగన్ తో సాన్నిహిత్యం కారణంగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా వెళ్లేందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆసక్తి చూపించడం లేదని సమాచారం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన+బీజేపీ కూటమి ఏపీలోని ప్రతిపక్ష టీడీపీతో కలవవద్దని రూట్ మ్యాప్ లో సూచించినట్టు ప్రచారం సాగుతోంది. ఈసారికి వదిలేసి 2029 ఎన్నికల్లో బలంగా పోరాడాలని.. అప్పటివరకూ జనసేనకు ఆర్థికంగా అండదండలు ఇస్తామని బీజేపీ పెద్దలు రూట్ మ్యాప్ ఇచ్చినట్టు తెలిసింది.

ఇక ఇది నచ్చకనే జనసేనాని పవన్ కళ్యాణ్ ఒంటరిగా బస్సుయాత్రను ఈ దసరా నుంచి షురూ చేసినట్టు తెలిసింది. 2024 ఎన్నికల్లోనూ వైసీపీని ఓడించాలని కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ కు బీజేపీ ప్రతిపాదనలు నచ్చలేదని.. అందుకే ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్లి జనసేనను బలోపేతం చేసి ఎన్నికల్లో గెలవాలని యోచిస్తున్నట్టు తెలిసింది. 2024 వరకూ అవసరమైతే టీడీపీ కలిసి వస్తే కలిసి పోటీచేసేందుకు యోచిస్తున్నట్టు సమాచారం.  బీజేపీ-వైసీపీ దోస్తానాపై పవన్ ఏమాత్రం సంతృప్తిగా లేడని తెలుస్తోంది. అందుకే ఈ ఒంటరి ప్రయాణం సాగిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. బీజేపీ చెప్పినట్టు 2029 వరకూ ఎదురుచూస్తే జనసేన పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని పవన్ ఆందోళన చెందుతున్నారు. మరోసారి జగన్ గెలిస్తే ఇక ఆపడం ఎవరి తరం కాదు. ఇప్పటికే జనసైనికులపై వైసీపీ దాడులు, మాటల దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. అలాగే వదిలితే జనసేననే లేకుండా చేసే కుట్రలు సాగుతాయి. రెండోసారి గెలిస్తే వైసీపీని ఎదుర్కోవడం జనసేనతో కానీ టీడీపీతో కానీ కాదు.. ఇక ఎన్నికల్లో గెలవకపోతే జనసైనికుల స్థైర్యం కూడా దెబ్బతిని పార్టీ కకావికలం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ ఒంటరిగానే పోరాడి వైసీపీని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేయబోతున్నట్టు తెలిసింది. అవసరమైతే బీజేపీని పక్కనపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular