AI Payments
AI Payments: దేశంలో డిజిటల్ చెల్లింపులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో మొదలైన ఈ ఆన్ లైన్ పేమెంట్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. అమెరికా లాంటి పెద్ద దేశం కూడా ఆఫ్ లైన్ పేమెంట్లను దాటి రాలేకపోతున్న సందర్భంలో.. ఇండియా మాత్రం ఆన్ లైన్ చెల్లింపుల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేంద్రం ఉద్దేశ్యం, ఆర్బీఐ లక్ష్యం కూడా నగదు రహిత చెల్లింపులే కాబట్టి.. వీటిని మరింతగా ప్రోత్సహించేందుకు అడుగులు పడుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్లైన్లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) లైట్ ద్వారా రోజువారీ లావాదేవీల పరిమితిని రూ.200 నుంచి రూ.500కు పెంచింది. మొత్తం పరిమితి రూ.2,000ను యథాతథంగా కొనసాగించింది. ప్రస్తుతం పేటీఎం, భీమ్ యాప్, గూగుల్ పేతో పాటు ఇతర పేమెంట్ యాప్లు, కెనరా బ్యాంక్, హెచ్డీఎ్ఫసీ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, పీఎన్బీ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. యూపీఐ లైట్ సేవలందిస్తున్నాయి. కృత్రిమ మేఽథ (ఏఐ) ఆధారిత వ్యవస్థతో సంభాషించడం ద్వారా యూపీఐతో చెల్లింపులు జరిపే సౌకర్యాన్ని కూడా ఆర్బీఐ అందుబాటులోకి తీసుకురానుంది.
మౌఖిక ఆదేశాల ద్వారా డిజిటల్ చెల్లింపుల లావాదేవీల ప్రక్రియను మరింత సులభతరం కానుందని.. స్మార్ట్ఫోన్లతో పాటు యూపీఐ లావాదేవీలు నెరిపేందుకు వీలుండే ఫీచర్ ఫోన్లలోనూ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేన్నునట్లు ఆర్బీఐ చెబుతోంది. యూపీఐ లైట్ను ప్రోత్సహించేందుకు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎ్ఫసీ) సాంకేతికత ద్వారా ఆఫ్లైన్లో చెల్లింపులు జరిపే వసతిని కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. తద్వారా ఇంటర్నెట్ అందుబాటులో లేని చోట లేదా కనెక్టివిటీ బలహీనంగా ప్రాంతాల్లో ఆఫ్లైన్లో చెల్లింపులు జరిపేందుకు ఈ సదుపాయం తోడ్పడనుంది. తాజాగా ప్రతిపాదించిన ఈ మూడు సదుపాయాలను అందుబాటులోకి తేవాలని యూపీఐ, యూపీఐ లైట్ వ్యవస్థల నిర్వహణ సంస్థ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆర్బీఐ చెబుతోంది.