టాలీవుడ్(Tollywood) లో ఈ నెలలో సినిమాల సందడి నెలకొంది. కరోనా తగ్గడంతో వరుసగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రధానంగా ఐదు ప్రముఖ సినిమాలు విడుదలయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మెల్లిమెల్లిగా పెద్ద సినిమాలు కూడా విడుదల చేయడానికి నిర్మాతలు సాహసం చేస్తున్నారు. ఈ నెల విడుదలైన సినిమాల్లో అతి కొద్ది సినిమాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలిచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. మునుపటి మాదిరిగా ప్రేక్షకులు థియేటర్లకు రాకున్నా ఉన్నంతలో బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన చిత్రాలివీ
గత వారం విడుదలైన ఐదు టాప్ చిత్రాల్లో ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) సినిమా మాత్రమే హిట్ జాబితాలో చేరగా.. మిగతావన్నీ యావరేజ్, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
గత వారం ‘రాజరాజచోర, ఎస్ఆర్ కళ్యాణ మండపం, పాగల్, బెల్ బాటమ్ (హిందీ) చిత్రాలు విడుదలయ్యాయి. మంచి అంచనాలతో విడుదలైన సినిమాలో రాజరాజ చోర మాత్రమే గ్రాండ్ హిట్ గా ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. ఇక బెల్ బాటమ్ మూవీ జాతీయ మీడియా నుంచి స్థానిక మీడియా వరకు ప్రశంసలు అందుకున్నా కానీ.. థియేటర్లకు జనాలను రప్పించడంలో విఫలమైందనే చెప్పాలి.
రాజ రాజ చోర చిత్రం అన్నింటికంటే అగ్రస్థానంలో నిలిచింది. శ్రీవిష్ణు నటన, హసిత్ గోలి కథనం అన్ని వర్గాల ప్రేక్షకుల, మీడియా ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పటికీ పెద్దగా కలెక్షన్లు రాకపోవడమే మైనస్ గా మారింది. పాగల్ మూవీపై భారీ అంచనాలున్నా సినిమా చూశాక మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మూడు రోజుల తర్వాత అసలు బాక్సాఫీస్ వద్ద సందడి లేకుండా పోయింది.
సినిమాలు బాగున్నా కలెక్షన్లు మాత్రం అనుకున్న స్థాయిలో రావడం లేదు. కారణం దేశాన్ని చుట్టుముట్టిన మహమ్మారి భయం అని చెప్పవచ్చు. మొదటి వేవ్ ముగిసిన తర్వాత పరిస్థితి ఇలా లేదు. కానీ సెకండ్ వేవ్ షాక్ ఇప్పటికీ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తుండడంతో ఎవరూ థియేటర్లకు రావడానికి సాహసించడం లేదు. అందుకే కలెక్షన్లపై ప్రభావం పడుతోంది.