CM Vijay Speech: మన దేశాన్ని సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పరిపాలించిన వారిలో నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ వంటి వారు ముఖ్యులు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏకంగా ఇందిరాగాంధీ రికార్డు బద్దలు కొట్టారు. మన్మోహన్ సింగ్ రికార్డును కూడా గతంలోనే ఆయన చెరిపివేశారు. దేశ రాజకీయాలలో నరేంద్ర మోడీ చూపిస్తున్న మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశ రాజకీయాలను నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు, ప్రధాని అయిన తర్వాత అన్నట్టుగా వర్గీకరించుకోవచ్చు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు.. పాలనపరంగా అనేక రకాల సంస్కరణలను తీసుకొచ్చారు. ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కలిగే విధంగా చేశారు. ప్రభుత్వం ఏదైనా చేస్తుందని భరోసా కల్పించారు. పారిశ్రామికంగా.. వ్యవసాయపరంగా.. రకరకాల మార్పులు తీసుకొచ్చారు నరేంద్ర మోడీ. ఫలితంగా దేశ ప్రధానిగా ఆయనను ఈ ప్రజలు మొత్తం నమ్మారు. వరుసగా మూడవ పర్యాయం ప్రధానమంత్రిగా ఎన్నికై.. దేశ ప్రజలకు ఆయన సుపరిపాలన అందిస్తున్నారు.
ఇప్పుడు విజయ్ కూడా అదే దారిలో ఉన్నట్టు కనిపిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. అనేక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు తమిళ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా మీడియా ఆయన మాటలకు విపరీతమైన కవరేజ్ ఇచ్చింది. విజయ్ మాట్లాడిన మాటలు సినిమా డైలాగుల మాదిరిగా ఉండకుండా.. వాస్తవ రూపం దాల్చితే మాత్రం ఆయన పొలిటికల్ లైఫ్ మరోవైపు టర్న్ తీసుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
విజయ్ డైలాగులు ఇవి
“ప్రభుత్వంలో ఒకే అధికార కేంద్రం ఉంటుంది. నేను మాత్రమే. అన్ని వైపులుగా అధికార కేంద్రాలు ఉండవు.
ఇది కొత్త చరిత్రకు నాంది. కొత్త శకానికి ప్రారంభం. పూర్తి సెక్యులర్, సోషల్ జస్టిస్ ఇవాల్టి నుంచి ఇక్కడ షురూ అవుతుంది.
నేను మీ వాడిని. తప్పు చేయను. తప్పు చేయడానికి ఆస్కారం ఇవ్వను. ఆ తప్పు చేసేవారు ఎవరైనా సరే కోదిరిపెట్టను.
నాకు డబ్బు అవసరం లేదు. ప్రజలకు సంబంధించిన ఒక పైస కూడా తినాల్సిన అవసరం నాకు లేదు.
నేను చేసే ప్రతి పనిలో పారదర్శకత ఉంటుంది. అందులో ధైర్యం ఉంటుంది. ముక్కుసూటితనం అంతకంటే ఉంటుంది
నేను తప్పుడు హామీలు ఇచ్చే వ్యక్తిని కాదు. చేసే స్థాయి ఉంటే మాత్రమే వాటిని ఇవ్వగలుగుతాను.
ఇక ఇప్పటినుంచి మాదకద్రవ్యాల నియంత్రణ మొదలవుతుంది. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమైంది.
మహిళలు మన గౌరవానికి ప్రతీక. వారి భద్రత అనేది మనకు అత్యంత ముఖ్యం. అందువల్లే వారికి సేఫ్టీ అందిస్తాం. సెక్యూరిటీ కూడా కల్పిస్తాం.
నన్ను విమర్శిస్తారు. ఇందులో నా స్నేహితులు ఉండవచ్చు. శత్రువులు కూడా ఉండవచ్చు. తమిళనాడులో ఉన్న 8 కోట్ల మంది కూడా నా వాళ్లే
నేను దైవదూత అని చెప్పడం లేదు. ప్రవక్త లాగా పూజించండి అని చెప్పడం లేదు. నేను కేవలం మనిషిని మాత్రమే
నేను గొప్ప కుటుంబాన్ని నుంచి రాలేదు. మాది రాజవంశం కాదు. నేను సామాన్యుడిని. కంటే ముందు మీలో ఒకడిని.
కోట్ల మంది ప్రజలు నా పక్కన నిలబడితే నేను దేన్నైనా స్వీకరించగలను. సాధించగలను. అధిగమించగలను. ఆ నమ్మకం నాకు పూర్తిస్థాయిలో ఉంది.
మీరందరూ కలిసి నాతో రండి. తమిళనాడు రాష్ట్రానికి కొత్త తరహాలో ఒక ప్రభుత్వాన్ని కల్పించి.. ప్రజలకు సేవ చేద్దాం.
ఈ పది మాటలు విజయ్ నోటి వెంట నుంచి వచ్చాయి. ఆయన మాట్లాడుతున్నంత సేపు ప్రజలు ఆసక్తిగా విన్నారు. ఒకవేళ ఈ పది మాటలను వచ్చే ఐదు సంవత్సరాలలో విజయ్ కనక తమిళనాడు రాష్ట్రంలో అమలు చేయగలిగితే.. ఈ దేశ ప్రజానీకం ఇటువంటి నాయకుడిని కోరుకుంటుంది. అది విజయ్ ద్వారానే జరగాలని భావిస్తే.. ఆయన ప్రధానమంత్రి అవడం కచ్చితంగా తథ్యం.