Tamil Nadu CM Vijay : తమిళనాడు రాష్ట్రంలో విజయ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తిచేసుకుంది.. ఈ వందరోజుల పరిపాలన కాలంలో తమ ప్రభుత్వం చేసిన పనులను ఆ ప్రకటనలో విజయ్ ప్రస్తావించారు. అంతేకాదు తమ ప్రభుత్వం 100 రోజుల కాలంలో చేసిన పనులకు సంబంధించి ప్రధాన పత్రికలకు ప్రకటనలు కూడా ఇచ్చారు. తమిళం తో పాటు.. ఇతర భాషల్లో కూడా ప్రకటనలు ఇచ్చారు. ఇందులో తెలుగు పత్రికలు కూడా ఉన్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మీద పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం ద్రోహం కాదు. అది గత నుంచి ఉన్నదే. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ వ్యవహరించినప్పుడు పంజాబ్ నుంచి మొదలు పెడితే మహారాష్ట్ర వరకు ఆయన స్థానిక భాషలలో ప్రకటనలు ఇచ్చారు. అప్పట్లో ఆయన దేశ్ కి నేత అవ్వాలని తెగ ప్రయత్నాలు చేశారు. ఏకంగా తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఢిల్లీలో పార్టీకి కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే బాటలో విజయ్ ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తోంది.
విజయ ప్రభుత్వం తమిళనాడులో అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో.. ఒక ప్రకటన ఇచ్చింది. అందులో తమ ప్రభుత్వం హయాంలో అమలు చేస్తున్న పథకాల గురించి.. ఇతర అంశాల గురించి ప్రస్తావించింది. అయితే దీని వెనుక భారీ ఉద్దేశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల తమిళనాడులో కీలక మంత్రి.. టీవీకేలో నెంబర్ 2 స్థానంలో కొనసాగుతున్న అధవ అర్జున బయటపెట్టారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక వ్యక్తి దేశ ప్రధాని కావాలని.. దక్షిణాదిలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారని.. వారికి ఆ అవకాశం ఇస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని అర్జున చెప్పారు. ఈ ప్రకారం వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయ్ ని ప్రతిపాదిస్తున్నట్టు ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. అందువల్లే విజయ్ గురించి తెలుగు మీడియాలో.. ఇతర దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ప్రధాన పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు..
విజయ్ కి తెలుగు రాష్ట్రాలలో కొంత ఫ్యాన్ బేస్ ఉంది. అతడి సినిమాలు కేరళలో కూడా ఆడుతుంటాయి. కర్ణాటకలో కూడా అతనికి ప్రత్యేకమైన అభిమాన దళం ఉంది. అందువల్లే విజయ్ ఈ స్థాయిలో ప్రకటనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల కావేరి జలాల వివాదం వల్ల విజయ్ కర్ణాటకలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ.. అది త్వరలోనే సమసిపోతుందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి అయిన కొద్దిరోజులకు విజయ్ కర్ణాటక వెళ్లారు. అక్కడ సుప్రసిద్ధ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన క్రైస్తవుడు అయినప్పటికీ.. అమ్మవారికి పూజలు చేయడం విశేషం. పూజలు చేసిన తర్వాత ఆయన స్వయంగా కారు తోలుకుంటూ వెళ్లారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.