
తిరుపతి లోక్సభ సీటు ఉప ఎన్నిక కోసం ఏపీ అధికార పక్షం తరఫున గురుమూర్తిని క్యాండిడేట్గా సెలక్ట్ చేశారు. కానీ.. ఆయనకు పెద్దగా రాజకీయ అనుభవం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఈ ఉప ఎన్నికల్లోని అభ్యర్థుల్లో ఆయనే జూనియర్. ఒక వైపు చూస్తే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి.. ఇటు చూస్తే మాజీ ఐఏఎస్ రత్నప్రభ.. ఇంకో వైపు ఆరుసార్లు ఎంపీగా గెలిచిన చింతా మోహన్. అందరూ మహామహులే. వీరిని తట్టుకొని గురుమూర్తి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎంతవరకనేది అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఎప్పుడైనా.. ఏ ఎన్నికల్లో అయినా రోడ్డు షోలు, బహిరంగ సభల్లో ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకోగలగాలి. పంచ్ డైలాగులు విసరగలగాలి. కానీ.. గురుమూర్తి నుంచి ఇవి ఏవీ ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆయన ప్రసంగాలేవీ లేవు. నామినేషన్ వేసే సందర్భంలో కూడా ఆయన గొంతు గట్టిగా పెగల్లేదు. చుట్టూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. అందరూ ఉండటంతో సహజంగానే గురుమూర్తి డంగైపోయారు. మీడియా ముందు మాట్లాడటానికీ ఇబ్బంది పడ్డారు.దీంతో పక్కనే ఉన్న మంత్రి పెద్దిరెడ్డి గురుమూర్తి భుజం తట్టారు. మాటిమాటికి గట్టిగా.. గట్టిగా అంటూ గురుమూర్తిలో చురుకు పుట్టించారు. గట్టిగా మాట్లాడవయ్యా గురుమూర్తి అంటూ సున్నితంగా సూచించారు.
గురుమూర్తి సాధారణంగా మెతక వైఖరి కలవారు. అందుకే ఆయనకు సపోర్టుగా పలువురు మంత్రులను మోహరింపజేశారు అధినేత జగన్. అభ్యర్థిని పక్కనపెట్టి.. సీఎం జగన్ పదే పదే సీనియర్లతో మంతనాలు జరిపేది కూడా అందుకేనని సమాచారం. అందులోనూ తిరుపతి ఉప ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కనీసం 4 లక్షల మెజార్టీ అంచనా వేస్తోంది. గతంలో వచ్చిన 2 లక్షల 28 వేల మెజార్టీతో పోల్చి చూస్తే ఈ ఏడాది లక్షా 70 వేల పైచిలుకు ఓట్లు ఎక్కువగా రావాలన్నమాట. అలా అయితేనే జనం వైసీపీతోనే ఉన్నారని, స్థానిక ఎన్నికలు గాలివాటం కాదని రుజువవుతుంది.
ఇందుకోసమే ప్రతీ నియోజకవర్గానికి ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యేని అటాచ్ చేశారు. గురుమూర్తి గెలుపు బాధ్యత వారి భుజాలపై పెట్టేశారు. వీరందరినీ కేంద్ర కార్యాలయం నుంచి వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తుంటారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున తొలిసారిగా పోటీ చేసిన నందిగం సురేష్ లాంటి వాళ్లు ఇప్పుడు రాజకీయాల్లో రాటుదేలారు. ప్రతిపక్షాలపై మాటల తూటాలు విసరడంలో సీనియర్లని మించిపోయారు. రాబోయే రోజుల్లో గురుమూర్తి నోటి వెంట కూడా పవర్ ఫుల్ డైలాగులు వినపడతాయేమో చూడాలి. ఇప్పటివరకూ జగన్ను పొగుడుతూ మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్