Chalasani Anjaneyulu: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. విజయ డెయిరి ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్. గత కొద్దిరోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఫుల్ స్టాప్ పడింది. విజయ డెయిరీ చైర్మన్ పదవికి తలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. టిడిపి హై కమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆయన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యము అని చెప్పుకొచ్చారు. తన రాజీనామా పత్రాన్ని ఏకంగా మంత్రి పార్థసారధికి అందజేశారు. ఆంజనేయులు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా.. ఆయన బెడ్ పైనుంచి తన రాజీనామా లేఖను మంత్రి పార్థసారధికి అందించడం విశేషం. ఇటీవల విజయ డైరీ చైర్మన్ పదవి విషయంలో ఆసక్తికర పరిణామం జరిగింది. నామినేషన్ వేయొద్దని టిడిపి హాయ్ కమాండ్ ఆంజనేయులును కోరింది. కానీ ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఉపసంహరించుకోలేదు కూడా. గురువారం ఉదయం వరకు నామినేషన్ వెనక్కి తీసుకుంటానని చెప్పారు. కానీ ఎన్నికల ప్రక్రియ ప్రకారం ఆంజనేయులు విజయ డైరీ చైర్మన్గా రెండు రోజుల కిందట ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
* హై కమాండ్ సీరియస్
తెలుగుదేశం పార్టీలో విజయా డెయిరీ విభాగం సంచలనంగా మారింది. దీంతో హై కమాండ్ గట్టి ఆదేశాలు ఇచ్చింది. పార్టీ కావాలో.. పదవి కావాలో తేల్చుకోవాలని చెప్పినట్లు ప్రచారం జరిగింది. విజయ డైరీ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత చలసాని ఆంజనేయులు, ఆయన కుమార్తెను మంత్రి కొల్లు రవీంద్ర, పార్థసారథి కలిసారు. పార్టీ హై కమాండ్ నిర్ణయాన్ని తెలిపారు. హై కమాండ్ సీరియస్ గా ఉందని చెప్పుకొచ్చారు. పార్టీ కావాలో.. పదవి కావాలో నిర్ణయించుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే తనకు ఒక రోజు సమయం కావాలని ఆయన కోరినట్లు ప్రచారం జరిగింది. ఇంతలోనే చలసాని అనారోగ్యానికి గురికావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం నాటకీయ పరిణామాల నడుమ తన పదవికి రాజీనామా చేశారు.
* జరిగింది ఇది..
విజయ డైరీ రాష్ట్రంలో అత్యంత ప్రభావంతమైన సహకార పాల సంఘాల్లో ఒకటి. కృష్ణా జిల్లాలో వేలాది పాల ఉత్పత్తిదారులతో అనుబంధం ఈ సంస్థ ది. ఆర్థిక రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ ప్రాధాన్యం ఉన్నాయి. అటువంటి డైరీ చైర్మన్ పదవి రైతు సహకార వ్యవస్థతో పాటు స్థానిక రాజకీయాల్లో కూడా ప్రభావం చూపుతుంది. ముందుగా డైరెక్టర్ల ఎన్నిక జరిగింది. చైర్మన్ ఎంపికపై చర్చ మొదలైంది. అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకొని చైర్మన్ పదవిని ప్రకటించాలని టిడిపి హై కమాండ్ భావించింది. కానీ ఈ ఆదేశాలను పక్కనపెట్టి చలసాని ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. ఇతర అభ్యర్థులు పోటీలో లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే దీనిని క్రమశిక్షణ ఉల్లంఘన గా చూస్తోంది టిడిపి హై కమాండ్. కీలక సహకార సంస్థల్లో అంతర్గత విభేదాలు బయటపడితే ప్రభుత్వంతో పాటు కూటమి ప్రతిష్ట దెబ్బతింటుందన్న ఆందోళన ఉంది. ఇంకోవైపు డైరీ నిర్వహణపై టిడిపిలోనే మరో వర్గం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. టెండర్ల కేటాయింపు, నిర్వహణ పనులు, ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయి అంటూ కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఈ చైర్మన్ ఎన్నిక ఒక సహకార సంఘం ఎన్నిక గానే కాకుండా.. టిడిపిలో క్రమశిక్షణ, అంతర్గత సమన్వయం, స్థానిక వర్గ పోరాటాలకు ప్రతీకగా మారింది.