YCP Protest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీ 2025 పై పోరాటం చేస్తోంది. అక్రమాలు జరిగాయంటూ.. దగా డీఎస్సీగా పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. వీటి వల్ల ఆ పార్టీకి మైలేజ్ ఎంతో చెప్పలేం కానీ.. ఆ పార్టీ శ్రేణుల అనుచిత ప్రవర్తన మాత్రం భారీగా డ్యామేజ్ చేస్తోంది. మొన్నటికి మొన్న జగన్ పర్యటనలో బందోబస్తుకు వచ్చిన ఓ మహిళ ఎస్సై పట్ల వైసీపీ శ్రేణులు అనుచితంగా ప్రవర్తించారు. తాజాగా చిత్తూరు జిల్లా పూతలపట్టు లో వైసీపీ నిరసన ర్యాలీకి సంబంధించి విధుల్లో ఉన్న ఓ మహిళా ఏఎస్ఐ పట్ల ఆ పార్టీ శ్రేణులు అనుచితంగా ప్రవర్తించాయి. ఆ మహిళా ఏ ఎస్ ఐ కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి తో పాటు ఓ 27 మందిపై కేసు కూడా నమోదయింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దూకుడుకు పోలీస్ మహిళా సిబ్బంది మూల్యం చెల్లించుకోవాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది.
* శ్రీకాకుళం పర్యటనలో..
మొన్ననే శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఓ బైక్ ప్రమాదంలో కేసును తారుమారు చేసిన మాజీ మంత్రి అప్పలరాజు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఆయన పరామర్శకుగాను జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం గుండా వెళ్ళగా వైసీపీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేశాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం సమీపంలో విధినిర్వహణలో ఉన్న బూర్జ ఎస్సై ప్రవల్లిక పట్ల వైసీపీ శ్రేణులు అనుచితంగా ప్రవర్తించాయి. ఈ ఘటనకు సంబంధించి ఆమదాలవలస వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చింతాడ రవికుమార్ తో సహా ఆ పార్టీ నాయకుల పై కేసులు నమోదయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలకు గురైంది.
* ఓ మహిళా ఏఎస్ఐ పట్ల..
శ్రీకాకుళం ఘటన మరువకముందే ఇప్పుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు లో మహిళ ఏఎస్ఐ జ్యోతి పట్ల అనుచితంగా ప్రవర్తించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. డీఎస్సీ 2025 పై నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో పోలీస్ విధుల్లో ఉన్నారు జ్యోతి. అనుమతి లేని కార్యక్రమం కావడంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఓ మహిళా అధికారి అని కూడా చూడకుండా ఆమెను తోసుకుంటూ ముందుకు వచ్చారు వైసీపీ శ్రేణులు. ఈ క్రమంలో ఆమె కింద పడి గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ సునీల్ కుమార్ తో సహా 27 మంది పై కేసు నమోదు చేశారు. పూతలపట్టు జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. వైసీపీ శ్రేణులు భారీ కేట్లు దాటుకుంటూ ముందుకు వెళ్లిన తరుణంలో తోపులాట జరిగింది ఈ ఘటనలో ఏఎస్ఐ జ్యోతి గాయపడ్డారు. వెంటనే ఆమెను పి కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు వైసిపి నేతలపై కేసు నమోదు చేశారు. అయితే వరుసగా పోలీసుల పట్ల.. పోలీస్ విధుల పట్ల ఇబ్బందికరంగా మారారు వైసీపీ శ్రేణులు. అయితే ఆ పార్టీకి మైలేజ్ కంటే డ్యామేజ్ చేస్తున్నాయి ఈ నిరసన కార్యక్రమాలు.
View this post on Instagram