Namaste Telangana: మీడియా అనేది ప్రజాస్వామ్యానికి బలమైన వ్యవస్థ కాదు. ఈ మాట అనడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మీడియా రాజకీయ నాయకులు చేతిలో తోలుబొమ్మలాగా మారిపోయిందో.. అప్పుడే దాని విశ్వసనీయతను కోల్పోయింది. రాజకీయ పార్టీలకు భజంత్రీలు మోగించే వ్యవస్థ లాగా మీడియా మారిపోయింది. మీడియాలో పని చేసేవారు రాజకీయ పార్టీలకు అనుగుణంగా వ్యవహరించడం మొదలుపెట్టారు.
ఒకప్పుడు పాత్రికేయులు అంటే గౌరవం ఉండేది. ఇప్పుడు పాత్రికేయులు పార్టీ కార్యకర్తలు కంటే దిగజారి పోయారు కాబట్టి సమాజంలో గౌరవం లేదు. విలువ అంతకంటే లేదు. మీడియా దిగజారిపోయిందని ఈ కథనం ప్రారంభంలో చెప్పాం కదా.. అది ఏ స్థాయిలో ఉందో తెలుగు నాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలలో ప్రతి రాజకీయ పార్టీకి అనుకూలమైన మీడియా.. సోషల్ మీడియా వ్యవస్థలు ఉన్నాయి. తమ గురించి గొప్పగా చెప్పుకోవడం.. గిట్టని వాళ్ల గురించి ఇష్టానుసారంగా రాయడం అలవాటుగా మారిపోయింది. ఒకవేళ గిట్టని రాతలు రాసిన సమయంలో.. ఎదుటివాళ్ళు గట్టిగా ప్రతిస్పందిస్తే మీడియా మీద దాడి అని చెప్పడం పరిపాటిగా మారిపోయింది. అంతేకాదు తమకు నచ్చని వాళ్ళ మీద రాసే రాతలను గొప్పగా చెప్పుకోవడం రివాజుగా మారిపోయింది.
తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి నమస్తే తెలంగాణ.. టీ న్యూస్ అనే మీడియా వ్యవస్థలు ఉన్నాయి. ఇవి కాకుండా సోషల్ మీడియా గ్రూపులు.. యూట్యూబ్ ఛానల్స్.. ట్విట్టర్ హ్యాండిల్స్ చాలా ఉన్నాయి. వీటి ద్వారా కాంగ్రెస్ పార్టీ మీద రోజుకు విపరీతంగా నెగిటివ్ వార్తలు.. కథనాలను పబ్లిష్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న సంఘటనలు కూడా ఏదో జరిగిపోయినట్టుగా చిత్రీకరిస్తూ ఉంటారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణకు దారుణమైన నష్టం జరిగిపోతోంది అన్నట్టుగా ప్రచారం చేస్తుంటారు. గడిచిన మూడు సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి ఈ పనులను విజయవంతంగా పూర్తి చేస్తున్నది.
ఇటీవల కాలంలో నమస్తే తెలంగాణలో కొడంగల్ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి బిగ్ షాడో అనే శీర్షికన ఒక కథనం ప్రచురితమైంది. దీనిపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడడం మొదలుపెట్టారు. నమస్తే తెలంగాణలో పబ్లిష్ అయిన వార్తను చూపిస్తూ.. తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాదు నమస్తే తెలంగాణ టిష్యూ పేపర్ అంటూ మండిపడ్డారు. చివరికి చెప్పులు తుడుచుకోవడానికి కూడా పనికిరాదు అన్నట్టుగా చెప్పారు. నమస్తే తెలంగాణ పేపర్ ను చూపిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇలా అడ్డగోలుగా కథనాలను రాస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. షూ కూడా తుడుచుకోవడానికి నమస్తే తెలంగాణ పేపర్ పనికి రాదని.. ఆ పేపర్ తో చెప్పులు తుడుచుకుంటామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది. దీనిపై గులాబీ పార్టీ నాయకులు ఇంతవరకు స్పందించలేదు. కొడంగల్ లో మొదలైన ఈ వ్యవహారం ఎక్కడదాకా దారితీస్తుందో చూడాల్సి ఉంది.