వైసీపీలో రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో ఎలా బయటపడడమో అంశంపై దృష్టి పెట్టిన అధిష్టానంపై రోజుకో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ అధినేత, సీఎం జగన్ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలిశారు. దాదాపు రెండు గంటలకు పైగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఇటు పార్టీ వ్యవహారాలు.. అటు ప్రభుత్వ పాలనపై ఇరువురి మధ్య చర్చ సాగినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రులపై చర్చ జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం చాలా మంది మంత్రులు ఉన్నామంటే.. ఉన్నాం అనే తీరులోనే వ్యవహరిస్తున్నారు. ఎవరూ కూడా యాక్టివ్గా ఉండడం లేదు. ఇక మరీ ముఖ్యంగా సీమకు చెందిన మంత్రులు అయితే చాలా మంది పేరుకు మాత్రమే ఉంటున్నారు.
Also Read: నిమ్మగడ్డపై జగన్ సర్కారు సీరియస్.. బ్రహ్మస్త్రం
ఇక ఉత్తరాంధ్రకు చెందిన మంత్రుల్లోనూ ఒకరిద్దరు మాత్రమే దూకుడుగా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాలలోనూ మంత్రుల కంటే ఇన్చార్జ్లు, పార్టీ సలహాదారుల డామినేషన్ ఎక్కువగా ఉంది. ఈ రెండు జిల్లాల్లో ఉన్న ఆరుగురు మంత్రుల్లో ఒకరు తప్ప దాదాపు అందరూ ఫెయిల్ అయినట్టే అంటున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల మంత్రులు మాత్రమే దూకుడుగా ముందుకు సాగుతున్నారు. దీంతో పార్టీపై తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు ఎవరూ మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. పార్టీలో మంత్రుల కంటే ఇతర నేతల డామినేటెడ్ పాలిటిక్స్ నడుస్తున్న నేపథ్యంలో వారి ఆధిపత్యం ఎక్కువగా ఉంది.
Also Read: చంద్రబాబుకు మరో దెబ్బ.. కీలకనేత రాజీనామా..
తాజాగా సీఎం జగన్ను కలిసిన ప్రశాంత్ కిశోర్ కూడా ఇదే విషయాన్ని జగన్తో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఐదారుగురు అస్సలు ఏ విషయాన్ని పట్టించుకోవడం లేదని.. తమకు ఏదైనా పనిచెబితే అది చేయడం మినహా.. తమకంటూ సొంత ఆలోచనతో ముందుకు సాగడం లేదని నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరిలో సీమ జిల్లాలకు చెందిన ఇద్దరు.. ఉత్తరాంధ్రకు చెందిన ఒకరు, ఇతర జిల్లాల నుంచి ఇద్దరు ఉన్నారని సమాచారం. వీరికి పార్టీపై ప్రేమ ఉన్నప్పటికీ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా వినిపిస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఈ నేపథ్యంలో త్వరలోనే జరగనున్న మంత్రి వర్గం విస్తరణలో వీరిని సంపూర్ణంగా పక్కన పెట్టేయవచ్చని అంటున్నారు వైసీపీ సీనియర్లు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు.. వారి వ్యవహార శైలి ప్రజల్లో వారికి ఉన్న ఫాలోయింగ్ వంటి వాటిని పరిశీలిస్తున్న అధిష్టానం.. ఇలాంటి లోటు పాట్లు లేకుండా చక్కటి టీంను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు సాగుతోందని అంటున్నారు. మొత్తానికి పీకే ఎఫెక్ట్ మంత్రులపై బాగానే వర్కవుట్ అవుతుందని చెబుతున్నారు.