Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేడుకగా సాగింది. అంచనాలకు మించి విజయవంతం అయింది. దాదాపు మూడున్నర లక్షల మంది ప్రజలు తరలివచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రెండు లక్షల మందిని జన సమీకరణ చేయాలన్నది ఆలోచన. కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. దీంతో కార్యక్రమం సక్సెస్ అయ్యింది. బహిరంగ సభ సైతం విజయవంతం అయింది. దీంతో కూటమి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం పట్ల ఒక రకమైన సానుకూలత, సంతృప్తి వ్యక్తం అవుతుంది. ప్రజలు ఎయిర్పోర్ట్ అనేది కేవలం రవాణా కోణంలో మాత్రమే చూడడం లేదు. ఆర్థిక అభివృద్ధికి.. ప్రధానంగా ఉత్తరాంధ్రకు ఒక ప్రయోజన కారిగా మారుతుంది అనేది ఒక అంశం బయటకు వచ్చింది. ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళన అదే.
* అలా మొదలైంది..
గత రెండు సంవత్సరాల కూటమిపాలనలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా జరిగాయి. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన హామీలో భాగంగా ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు అయ్యింది. అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు.. ఈ ప్రాంతాన్ని ఆర్థిక అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ఒక ఎయిర్పోర్ట్ అవసరం అని భావించారు. పైగా అవసరాలకు అనుగుణంగా విశాఖ విమానాశ్రయం పనిచేయడం లేదు. పైగా నేవీ ఆధీనంలో ఉండడంతో కమర్షియల్ విమానాల రాకపోకలకు, అంతర్జాతీయ విస్తరణకు అవకాశం లేకుండా పోయింది. ఆ సమయంలో వచ్చిన ఆలోచన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. అలా 2019 ఫిబ్రవరిలో విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు నాటి సీఎం చంద్రబాబు. భూ సమీకరణ పనులు మొదలుపెట్టారు.
* జగన్ మాటలతో డ్యామేజ్..
ఇంతలోనే టిడిపి అధికారం కోల్పోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే విమానాశ్రయంపై చాలా రకాలు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ప్రతిపక్ష కోణాన్ని ఆలోచించి నిర్వాసితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. విశాఖలో విమానాశ్రయం ఉండగా 50 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమా అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని అడ్డుకుంటామని… భూములు ఇచ్చిన రైతులకు వెనక్కి ఇస్తామని జగన్ ప్రకటనలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత భూ సేకరణ మొదలుపెట్టారు. కానీ విమానాశ్రయ నిర్మాణ పనులు జరపలేదు. నిర్వాసితుల సైతం జగన్ పై ఒక రకమైన ఆగ్రహంతో ఉండగా.. రాష్ట్రస్థాయిలో మరోసారి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు 2023 మే లో శంకుస్థాపన చేశారు. పనులు నత్త నడకన సాగాయి. అయితే 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం చంద్రబాబు ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిర్ణయించారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యవహరించడంతో ఈ పనులు శరవేగంగా ముందుకు వెళ్లాయి. ఇప్పుడు ప్రారంభోత్సవం నేర్చుకుంది టిడిపి కూటమి హయాంలోనే. కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించింది చంద్రబాబు.. ఇప్పుడు ప్రారంభోత్సవం చేసి గుమ్మడికాయ కొట్టింది చంద్రబాబు. మధ్యలో జాప్యంతో పాటు నిర్వాసితుల విషయంలో చేసిన ప్రకటనలు జగన్మోహన్ రెడ్డికి నష్టం చేకూర్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేశాయి. ఇప్పుడు ప్రారంభోత్సవం నోచుకోవడంతో కూటమిపట్ల సానుకూలత వస్తోంది ప్రజల్లో. దీంతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.