Homeజాతీయ వార్తలుKCR-Kondagattu : పాతికేళ్లకు కరుణించిన అంజన్న అనుగ్రహం.. అందుకే కొండగట్టుకు కేసీఆర్‌!

KCR-Kondagattu : పాతికేళ్లకు కరుణించిన అంజన్న అనుగ్రహం.. అందుకే కొండగట్టుకు కేసీఆర్‌!

KCR-Kondagattu : సాధారణంగా హనుమాన్‌ ఆలయం లేని ఊరు ఉండదు. ప్రతీ గ్రామంలో అంజన్నను ద్వారపాలకుడిగా కొలుస్తారు. తెలంగాణలో ఎన్ని హనుమాన్‌ ఆలయాలు ఉన్నా.. కొండగట్టుకు ఉన్న ప్రత్యేకత వేరు. పవర్‌ఫుల్‌ హనుమాన్‌గా తెలంగాణతోపాటు ఆంధ్రా, మహారాష్ట్ర భక్తులు కొండగట్టు అంజన్నను కొలుస్తారు. బ్రహ్మచారి అయిన హనుమాన్‌ సంతానం కలుగాలని కొండగట్టుకు వచ్చే భక్తులను కరుణిస్తాడు. ఇక మానసిక ఆందోళనలు, గ్రహదోషాలు పోగొట్టే దేవునిగా భక్తులు కొండగట్టు అంజన్నను కొలుస్తారు. ఆయన అనుగ్రహం లేనిదే కొంగట్టుకు వెళ్లలేమని భక్తుల నమ్మకం. సామే తన భక్తులను కొండగట్టుకు రప్పించుకుంటారని చెబుతారు. మనం కొండగట్టుకు వెళ్లాలని ఎంత ప్రయత్నించినా స్వామి కరుణలేనిదే జరుగదే అనేది హనుమాన్‌ భక్తులు చెబుతారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కూడా ఇన్నేళ్లకు కొండగట్టు అంజన్న కరుణించాడని చెబుతున్నారు. ఆయన అనుగ్రహం లేకపోవడంతోనే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు పదుల సార్లు వచ్చిన కేసీఆర్‌ కొండగట్టుకు రాలేకపోయారని చెబుతున్నారు.

-25 ఏళ్ల క్రితం కుటుంబ సమేతంగా..
కేసీఆర్‌ చివరిసారిగా కొండగట్టుకు 25 ఏళ్ల క్రితం వచ్చారు. 1983లో నందమూరి తారకరామారావు పిలుపులో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీడీపీలో చేరారు. 1983 జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మదన్‌మోహన్‌ చేతిలో ఓడిపోయారు. 1985–1999 మధ్య నాలుగు పర్యాయాలు టీడీపీ టికెట్‌పై సిద్దిపేట నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్‌ నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకుడు కేబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. నాడు కుటుంబ సభ్యులతో కలిసి నాటి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మల్యాల మండలం కొండగట్టుకు వచ్చారు. భార్య పిల్లలతో కలిసి అంజన్నను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.

-నాడు మంత్రిగా.. నేడు ముఖ్యమంత్రిగా..
1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ మంత్రిగా కొంటగట్టుకు కుటుంబ సమేతంగా కేసీఆర్‌ వచ్చారు. తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. అసెంబ్లీ yì ప్యూటీ స్పీకర్‌గా కేసీఆర్‌ను నియమించారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంలో 2001లో కేసీఆర్‌ టీడీపీని వీడారు. తెలంగాణ ఉద్యమాన్ని తన భుజానికి ఎత్తుకుని మేధావులు, తెలంగాణ ఉద్యమకారులతో చర్చలు జరిపి టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించారు. 13 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణను సాధించారు. 2014లో స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. దీంతో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు రెండోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌ మరో తొమ్మిది నెలల్లో పదవీకాలం ముగియనుంది. ఎట్టకేలకు పాతికేళ్ల తర్వాత కేసీఆర్‌పై కొండగట్టు అంజన్నకు కరుణ కలిగింది. స్వామి అనుగ్రహతో నాడు మంత్రి హోదాలో వచ్చిన కేసీఆర్‌ నేడు ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టుకు వచ్చారు.

-ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..
పాతికేళ్ల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. కొండగట్టుకు చేరుకున్న కేసీఆర్‌.. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కేసీఆర్‌కు ఆశీర్వచనాలు అందించి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌ అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనాలు, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

-విహంగ వీక్షణం..
అంతకుముందు హెలికాప్టర్‌ ద్వారా కొండగట్టుకు చేరుకున్న సీఎం.. ముందుగా విహంగ వీక్షణం ద్వారా ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం బస్సులో కొండగట్టు గుట్టపైకి చేరుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్‌.. ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌ సాయితో కలిసి ఆలయాభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఆలయాన్ని దివ్యక్షేత్రంగా రూపుదిద్దే క్రతువులో భాగంగా ఇప్పటికే రూ.100 కోట్ల నిధులను ప్రకటించగా.. చేపట్టాల్సిన పనులపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు–చేర్పులపై సమాలోచనలు జరపనున్నారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కొండగట్టులో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు.. ఘాట్‌ రోడ్ల అభివృద్ధి, ఆలయ ఆవరణలో గ్రీనరీ ఏర్పాట్లు, భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, నూతన కాటేజీల నిర్మాణం.. నడకదారి అభివృద్ధి లాంటి పనులు చేయాలన్న డిమాండ్‌ ఉంది. తాగు నీటితో పాటు కోనేరులో నీటి కోసం ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుందని భక్తులు పేర్కొంటున్నారు. కొత్తగా క్యూలైన్ల ఏర్పాటుతోపాటు మహిళలు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

మొత్తంగా రెండున్నర దశాబ్దాల తర్వాత కొండగట్టుకు వచ్చిన కేసీఆర్‌ అంజన్న క్షేత్రాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular