Rega Kantha Rao: నిజమే.. కెసిఆర్ కొన్ని విషయాలలో బ్లండర్.. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన వనమా వెంకటేశ్వరరావు ను కాంగ్రెస్లో గెలిచినప్పటికీ.. గులాబీ పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకు అపరిమితమైన అధికారాలు ఇచ్చారు. తర్వాత ఏం జరిగింది.. ఆయన కుమారుడు వనమా రాఘవ కొత్తగూడెంలో రాజ్యాంగేతర శక్తిగా మారిపోయారు. చివరికి ఆయన వేధింపులు తట్టుకోలేక రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఈ సంఘటన కలకలం రేపింది. వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అప్పట్లో గులాబీ పార్టీ ప్రకటించింది. కానీ ఇటీవల గులాబీ పార్టీలో వనమా రాఘవ కనిపిస్తూనే ఉన్నారు.. తనదైన రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ఆస్తిత్వం.. తెలంగాణ హక్కులు.. తెలంగాణ ప్రజలు అంటూ మాట్లాడే కెసిఆర్.. ఇటువంటి వారి విషయంలో ఏం చేస్తున్నట్టు.. ఇటువంటి వ్యక్తులను తెలంగాణ సమాజం మీద ఎందుకు రుద్దుతున్నట్టు..
వనమా ఎపిసోడ్ తోనే ఈ జిల్లాలో గులాబీ పార్టీ నేతల బాగోతం ఆగిపోలేదు. ఇప్పుడు నేనున్నానంటూ గులాబీ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముందుకు వచ్చారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. సంకట స్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ.. కాంతారావు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా ఈయన యూట్యూబ్ ఛానల్ పేరుతో ఒక మహిళను వేధించారు. ఆమెను లోబర్చుకున్నారు. చివరికి సన్నిహిత వీడియోలను.. ఫోటోలను రికార్డు చేసి బెదిరించడం ప్రారంభించారు. కాంతారావు దూకుడు తట్టుకోలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది.
కాంతారావు ఇప్పుడే కాదు.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వివాదాస్పదుడే.. గతంలో అటవీశాఖ అధికారులు పోడు భూముల్లో కందకాలు తీస్తున్నప్పుడు.. వారిని బహిరంగంగానే హెచ్చరించారు. ఆదివాసులను వారి మీద దాడులు చేసే విధంగా ఉసిగొల్పేవారు. ఖబర్దార్ చూసుకుందాం అంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని మీటింగులు కూడా పెట్టేవారు. కానీ ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ఆదివాసులకు చేసిన ప్రయోజనం దాదాపు శూన్యం.
గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోడు భూములకు పట్టాలు కల్పించినప్పుడు.. అందులో మెజారిటీ భూములు ఈ అనే సొంతం చేసుకున్నారు. సమత్ బట్టుపల్లి.. పినపాక నియోజకవర్గం లోని అనేక గ్రామాలలో ఈయన భూములను ఆక్రమించారని.. ఆ భూములు మొత్తం బినామీల చేతిలో ఉన్నాయని.. ఆ భూములకు పట్టాలు కూడా ఇప్పించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ నాయకులు కాంతారావు మీద భూకుంభ కోణాల ఆరోపణలు చేయడం విశేషం. దీనిపై ప్రభుత్వం ఎంక్వయిరీ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇలా ఉండగానే.. ఒక మహిళను వేధించిన కేసులో కాంతారావు అరెస్టు కావడం విశేషం. ఈ వ్యవహార తర్వాత కాంతారావు ను గులాబీ పార్టీలో కొనసాగినిస్తారా.. ఆయనను కొనసాగిస్తే పార్టీకి బలం ఉంటుందా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.