దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఏర్పడిన నేపథ్యంలో ఇండ్ల ధరలు 20 శాతం వరకూ పడిపోయే ప్రమాదముందని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పారేఖ్ తెలిపారు. నరెడ్కో ఏర్పాటు చేసిన వెబినార్లో మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, నగదు నిల్వలున్న ఇండ్ల కొనుగోలుదారులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికిదే సరైన సమయమని సూచించారు.
వాస్తవానికి కోవిడ్ రాకముందే దేశీయ నిర్మాణ రంగం కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నదన్న ఆయన.. నిధుల కొరత, నిర్మాణ రంగంలో నిరర్థక ఆస్తుల విలువ పెరగడం వంటివి పెనుభారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుబాటు గృహాలకు కేంద్రం ప్రోత్సాహం ప్రకటించినా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కరోనా ఉత్పాతం వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు.
మరోవైపు కోవిడ్-19 వల్ల దెబ్బతిన్న నిర్మాణ రంగాన్ని ఆదుకోవడానికి రియల్ రంగానికిచ్చిన రుణాల్ని రీ స్ట్రక్చర్ చేయాలని సూచించారు.
ఇలా ఉండగా, మే 3 వరకూ లాక్డౌన్ పొడిగించాలన్న ప్రధానమంత్రి నిర్ణయాన్ని తెలంగాణ నిర్మాణ రంగం స్వాగతించింది. కాకపోతే, కట్టుదిట్టమైన రక్షణ చర్యల్ని తీసుకునే రియల్ సంస్థలకు నిర్మాణ కార్యకలాపాల్ని చేపట్టేందుకు ఉద్దీపన ప్రకటించాచాలని అభ్యర్థించింది.