LPG EKYC: దేశవ్యాప్తంగా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ పూర్తి చేయాల్సింది. అయితే ఈ కేవైసీ పూర్తి చేయడానికి ఇప్పటి వరకు గ్యాస్ ఏజెన్సీ కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ నుంచి ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ-కేవైసీ చేసుకునే సదుపాయాన్ని చమురు కంపెనీలు కల్పిస్తున్నాయి. మరి ఏ గ్యాస్ వినియోగదారులు ఎలా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు? అందుకోసం ఎలాంటి యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోవాలి?
ఈ-కేవైసీ ఎందుకు చేయాలి?
ఎల్పీజీ కనెక్షన్ అసలైన వినియోగదారుడిదేనా? అనే విషయాన్ని ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా నిర్ధారించడం ఈ-కేవైసీ ఉద్దేశం. ముఖ్యంగా ఉజ్వల పథకం వంటి ప్రయోజనాలు పొందుతున్న వినియోగదారులకు ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రభుత్వం గతంలో స్పష్టం చేసిన ప్రకారం.. ఈ ప్రక్రియను డెలివరీ సిబ్బంది ద్వారా, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద లేదా సంబంధిత కంపెనీ మొబైల్ యాప్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు.
ఫోన్లో ముందుగా ఏ యాప్స్ ఉండాలి?
మొబైల్ ద్వారా ఈ-కేవైసీ చేయాలంటే మీ గ్యాస్ కంపెనీకి సంబంధించిన అధికారిక మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇండేన్ వినియోగదారులు‘ఇండియన్ ఆయిల్ వన్’ యాప్, భారత్ గ్యాస్ వినియోగదారులు ‘హలో బీపీసీఎల్’, హెచ్పీ గ్యాస్ వినియోగదారులు ‘హెచ్ పీ పే’ యాప్ను ఉపయోగించవచ్చు. వీటితో పాటు ముఖ గుర్తింపు ద్వారా ఆధార్ ధ్రువీకరణ కోసం ‘ఆధార్ ఫేస్ ఆర్ డీ’ యాప్ అవసరం అవుతుంది.
ఎలా చేయాలి?
ఉదాహరణకు ఇండేన్ వినియోగదారులు అయితే ముందుగా ‘ఇండియన్ ఆయిల్ వన్’ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్తో లాగిన్ అయిన తర్వాత ‘ఈ కేవైసీ’ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. అవసరమైన వివరాలను పరిశీలించిన తర్వాత నిబంధనలకు అంగీకారం తెలిపి ఫేస్ స్కాన్ ప్రారంభించాలి. ఆ సమయంలో ‘ఆధార్ ఫేస్ ఆర్ డీ’ యాప్ తెరుచుకుంటుంది. స్క్రీన్పై కనిపించే సూచనలను పాటిస్తూ కెమెరా ముందు ముఖాన్ని చూపిస్తే ఫేస్ ఆథెంటికేషన్ పూర్తవుతుంది. అనంతరం ఈ-కేవైసీ అభ్యర్థనను సబ్మిట్ చేయాలి. మిగతా గ్యాస్ వినియోగదారులు కూడా ఇలాగే పూర్తి చేసుకోవచ్చు.
ఫేస్ స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త..
ఫేస్ ఆథెంటికేషన్ సమయంలో మొబైల్ కెమెరా స్పష్టంగా పనిచేసేలా చూసుకోవాలి. ముఖంపై ఎక్కువగా నీడ పడకుండా తగిన వెలుతురు ఉండాలి. కెమెరా ముందు ముఖాన్ని సరిగ్గా ఉంచి స్క్రీన్పై కనిపించే సూచనలను పాటించాలి. ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ చేసి ఉంటే ఆథెంటికేషన్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఎల్ పీజీ కనెక్షన్కు సంబంధించిన మొబైల్ నంబర్, ఆధార్ వివరాలు సరిగ్గా ఉండటం కూడా ముఖ్యమే.
ఈ-కేవైసీ గడువుపై ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో భిన్నమైన తేదీలు ప్రచారంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 16 ఆగస్టు 2026 తేదీలను పేర్కొంటున్నారు. అయితే దీనిపై సంబంధిత డీలర్ ను సంప్రదించడం మంచిది.