
ఫిబ్రవరి సెకండ్ వీక్లో తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మార్చి 15 నాటికే ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అప్పటిలోగా కొత్త ఎంపీ రావాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలంటే నెల రోజుల ముందే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి తిరుపతి ఉప ఎన్నికల మీద పడింది. మరోవైపు.. పార్టీలు కూడా తిరుపతి బై పోల్ను చాలెంజ్గా తీసుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలూ అక్కడే మకాం వేశాయి. తిరుపతి సీటును గెలుచుకుని ఎలాగైనా తమ సత్తాచాటాలని చూస్తున్నాయి. ఇటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో ఉనికి చాటుకోవాలని చూస్తున్నాయి. మరి అధికార వైసీపీలో పరిస్థితి ఏంటి అన్నదే ఆసక్తికరమైన చర్చ.
Also Read: గంటా రాజీనామా.. జనాన్ని సంతృప్తి పరచడానికే?
తిరుపతి వైసీపీకి అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పేరును అనధికారికంగా పార్టీ ఖరారు చేసింది. జగన్ ఆయనకు మాట ఇచ్చేశారు కూడా. కీలక నేతలకు కూడా ఈ సంగతి చెప్పేశారు. అయితే.. తిరుపతి ఉప ఎన్నిక అంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఏడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నిక ఉంటుంది. పైగా అసలు ఎన్నికల కంటే ఈ కొసరు ఎన్నికలకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ప్రతిష్టతో కూడుకున్న ఉప ఎన్నిక కావడంతో ఖర్చుకు ఆకాశమే హద్దు అంటున్నారు. మరి ఆర్థికంగా చూస్తే గురుమూర్తికి అంత స్తోమత లేదని పార్టీ వర్గాల సమాచారం.
మొత్తంగా ఎలాగైనా తిరుపతి ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకూడదనే జగన్ టార్గెట్. అందుకే.. ఈ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఆర్థిక భారాన్ని కూడా జిల్లాకు చెందిన నేతలు, పెద్దలు, మంత్రులు భరించాలన్నదే పార్టీ విధానంగా ఉందట. అలా అయితే కచ్చితంగా వంద కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గానికి పది నుంచి పదిహేను కోట్లు వేసుకున్నా వంద కోట్లు పట్టుకుంటేనే తప్ప ప్రత్యర్థులను తట్టుకుని ధాటిగా ప్రచారం చేయలేమని నేతలు అంటున్నారు. అయితే తాము ప్రచారం ఎంతైనా చేస్తాం కానీ ఖర్చు మాత్రం ఆ రేంజ్లో భరించడం అంటే వల్ల కాదని పలువులు సీనియర్లు చేతులెత్తేస్తున్నారుట.
Also Read: అరకులో ఘోర రోడ్డుప్రమాదం.. హైదరాబాద్ లో విషాదం
అందుకే.. తిరుపతి ఎన్నికల నోటిఫికేషన్ రాగానే జగన్ అందరినీ కూర్చోబెట్టి బాధ్యతలతోపాటు ఖర్చుల భారాన్ని కూడా తలా ఇంతా పంచుతారని తెలుస్తోంది. అయితే వైసీపీలో ఇప్పుడు ఇంకో మాట కూడా వినిపిస్తోంది. డబ్బు ఖర్చుకు వెనకాడని వారు కొంతమంది పోటీకి రెడీ అంటున్నారట. వారిలో ఒకరిని ఎంపిక చేస్తే తమకు ఈ ఆర్థిక భారం తప్పుతుంది కదా అనేది వాదన. ఆ విధంగా వంద కోట్ల దాకా ఖర్చు పెట్టడానికి ఒక మాజీ ఎంపీ కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్ మనసు గురుమూర్తి మీదనే ఉంది. దాంతోనే అటు నాయకుడికి చెప్పలేక ఇటు భారం మోయలేక వైసీపీ నేతలు పరేషాన్ అవుతున్నారుట. మరి చివరగా నోటిఫికేషన్ వచ్చాక నిర్ణయం ఎటు మలుపు తిప్పుతుందో చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్