middle class finance : మధ్యతరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి పనిచేసినా ఆశించినంత ఆర్థిక స్థాయికి చేరుకోలేకపోవడానికి కొన్ని సాధారణ ఆర్థిక అలవాట్లు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. మంచి ఆదాయం వచ్చినా సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల సంపద పెరగకుండా అప్పులు, ఖర్చుల చక్రంలోనే చిక్కుకుపోతున్నారు. ఆ కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం:
చాలా మంది తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని అత్యవసర నిధిగా దాచుకోవడం మర్చిపోతారు. ఉద్యోగం పోవడం, అనారోగ్యం, ప్రమాదం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే అప్పులు చేయాల్సి వస్తుంది. కనీసం 6 నుంచి 12 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. కానీ ఈ నిధి లేకపోవడం వల్ల సంపాదించిన డబ్బు మొత్తం అప్పుల చెల్లింపులకే వెళ్లిపోతుంది.
లోకల్ చిట్టీలపై అధిక ఆధారపడటం:
కొంతమంది త్వరగా డబ్బు అవసరమై స్థానిక చిట్టీల్లో చేరి ముందుగానే డబ్బు తీసుకుంటారు. దీంతో భారీ డిస్కౌంట్ లేదా కమిషన్ కోత పడుతుంది. తర్వాత నెలనెలా చిట్టీ కట్టాల్సి రావడంతో కుటుంబ బడ్జెట్ దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో చిట్టీలు నిలిచిపోవడం లేదా మోసాలు జరగడం వల్ల మూలధనం కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
అనవసరమైన ఈఎంఐలు పెంచుకోవడం:
ఫోన్, టీవీ, బైక్, ఫర్నిచర్, గృహోపకరణాలు… ఇలా అవసరం లేకపోయినా ఈఎంఐలపై కొనుగోలు చేసే అలవాటు పెరుగుతోంది. నెలవారీ ఆదాయంలో ఎక్కువ భాగం ఈఎంఐలకే వెళ్తే పొదుపు చేయడానికి అవకాశం ఉండదు. ఒకటి పూర్తికాకముందే మరో ఈఎంఐ తీసుకోవడం వల్ల అప్పుల భారం మరింత పెరుగుతుంది.
ఒకే ఆదాయంపై ఆధారపడటం:
చాలా కుటుంబాల్లో ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా వచ్చే ఒకే ఆదాయంపైనే ఆధారపడుతుంటారు. ఆ ఆదాయం ఏదైనా కారణంతో ఆగిపోతే మొత్తం కుటుంబ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. అందుకే అదనపు ఆదాయ మార్గాలు, పార్ట్టైమ్ పని, పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం లేదా చిన్న వ్యాపారం వంటి మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
త్వరగా డబ్బు వస్తుందనే ఆశతో పెట్టుబడులు పెట్టడం:
‘తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు’,వంటి ఆఫర్లకు ఆకర్షితులై చాలామంది డబ్బు పెట్టుబడి పెడతారు. సరైన అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల మోసాలకు గురై జీవితాంతం కూడబెట్టిన పొదుపు కూడా కోల్పోతారు. పెట్టుబడులు పెట్టే ముందు సంస్థ విశ్వసనీయత, రిస్క్, రాబడి వంటి అంశాలను పూర్తిగా పరిశీలించడం చాలా ముఖ్యం.
సంపాదన పెంచుకోవడం కంటే ఖర్చులు పెంచుకోవడం:
జీతం పెరిగినప్పుడల్లా కొత్త ఖర్చులను కూడా పెంచుకోవడం చాలా మంది చేసే పొరపాటు. ఆదాయం పెరిగే కొద్దీ పొదుపు, పెట్టుబడులను పెంచాల్సిన బదులు విలాసవంతమైన జీవనశైలిని ఎంచుకోవడం వల్ల సంపద పెరగదు. ఆదాయంతో పాటు పొదుపు శాతం కూడా పెరిగితేనే భవిష్యత్తులో ఆర్థిక స్వాతంత్ర్యం సాధ్యమవుతుంది.