New party in AP: ఏపీలో కొత్త పార్టీ రాబోతుందా? మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుందా? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ. ఏడాదిన్నర కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఇకనుంచి రాజకీయాలు చేయను.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. కానీ కొద్ది రోజులకే యూటర్న్ తీసుకున్నారు. రాజకీయ ప్రకటనలు చేస్తూ మళ్ళీ పాలిటిక్స్ కు వస్తానని ప్రకటించారు. ముందుగా మీడియాను ఏర్పాటు చేసి తర్వాత రాజకీయాల్లో చేరుతానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు డిజిటల్ మీడియా ఏర్పాటు పూర్తయింది. రాజకీయ రంగ ప్రవేశం మిగిలింది. అయితే ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని.. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా విజయసాయిరెడ్డి అడుగులు వేస్తున్నారని తాజాగా ప్రచారం మొదలైంది.
మారిన పరిస్థితులతో..
బీహార్లో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ఆయన తన స్వరాష్ట్రంలో జన సూరజ్ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగారు. కానీ ఓటమి ఎదురయింది. కానీ రాజధాని లక్నో పరిధిలో బంకిపూర్ బై పోల్ లో ప్రశాంత్ కిషోర్ ఘనవిజయం సాధించారు. మరోవైపు దేశవ్యాప్తంగా జెన్ జీ ఉద్యమం నడుస్తోంది. కొత్త రాజకీయ పార్టీలకు ఆప్షన్ ఏర్పడింది. అందుకే విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయ సేకరణకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి.. ఔత్సాహిక రాజకీయ నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఈ విషయంలో కొందరు బ్యూరోక్రాట్ల సహాయం తీసుకునేందుకు సైతం విజయసాయిరెడ్డి సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైసీపీలోకి యూటర్న్..
గత ఏడాది జనవరిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఇకనుంచి ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు పెట్టుకోనని స్పష్టం చేశారు. వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటానని తేల్చి చెప్పారు. కానీ అలా ఉండలేకపోయారు. రాజకీయ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో హిందుత్వ కామెంట్స్ చేస్తూ బిజెపికి దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు. కానీ టిడిపి నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో మళ్లీ వైసీపీలో చేరుతారన్న ప్రచారం నడిచింది. కానీ విజయసాయిరెడ్డి అక్కడకు వెళ్తే గౌరవం ఉండదని భావిస్తున్నారు. అందుకే కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన డిజిటల్ మీడియాను ఏర్పాటు చేశారు. దాని ఏర్పాటు దాదాపు పూర్తయింది. కొత్త పార్టీ ఏర్పాటు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.