Galwan Clash : భారత్–చైనా సరిహద్దులో గాల్వన్ ఘటన జరిగి ఐదేళ్లు దాటింది. ఈ ఘటనలో భారత్కు చెందిన భద్రతా సిబ్బంది మరణించారు. తెలుగు వాడైన కల్నల్ సంతోష్బాబు చైనా సైనికుల దాడిలో చనిపోయాడు. ఈ ఘటన జరిగిన ఇన్నేళ్ల తర్వాత చైనా కీలక నిర్ణయం తీసుకుంది. చైనా ప్రభుత్వం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) వెస్టర్న్ థియేటర్ కమాండ్ మాజీ కమాండర్ జనరల్ ఝావో జోంగ్కీపై చర్య తీసుకుంది. కీలకమైన చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) సభ్యత్వంతో పాటు మరో రెండు పదవుల నుంచి తొలగించింది. అధికారికంగా కారణం వెల్లడించకపోయినా, ఈ నిర్ణయం దేశీయ, అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఝావో జోంగ్కీ హయాంలో కీలక సంఘటనలు..
2016 నుంచి 2020 వరకు వెస్టర్న్ థియేటర్ కమాండ్కు నాయకత్వం వహించిన ఝావో హయాంలోనే భారత్–చైనా సరిహద్దులో రెండు ముఖ్యమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 2017లో 72 రోజులపాటు సాగిన డోక్లామ్ ఘర్షణ, 2020లో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణ ఈ కాలంలోనే జరిగాయి. గల్వాన్ సంఘటనలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ఆయన ‘భారత్కు గుణపాఠం చెప్పాలి’ అనే ఆలోచనతో ఆపరేషన్కు ఆదేశాలు ఇచ్చారనే ఆరోపణలు గతంలోనే వినిపించాయి. ఆయనను సరిహద్దు వ్యవహారాల్లో హాక్గా చూసేవారు ఉన్నారు.
చైనాలో కొనసాగుతున్న సైనిక శుద్ధి
ఝావో తొలగింపు విడిగా జరిగిన సంఘటన కాదు. ఇటీవల కాలంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నాయకత్వంలో పీఎల్ఏలో విస్తృత శుద్ధి కార్యక్రమం సాగుతోంది. అవినీతి, క్రమశిక్షణ ఉల్లంఘనల పేరుతో అనేక మంది సీనియర్ జనరల్స్ను పదవుల నుంచి తొలగించడం, విచారణలు జరపడం కొనసాగుతోంది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యులు సహా అనేక మంది టాప్ ఆఫీసర్లు ప్రభావితమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఝావోను సీపీపీసీసీ నుంచి తొలగించింది.
భారత్–చైనా సంబంధాలపై ప్రభావం
గల్వాన్ ఘర్షణ భారత్–చైనా సంబంధాల్లో లోతైన గాయం మిగిల్చింది. ఆ తర్వాత సరిహద్దులో సైనిక మోహరింపులు పెరిగాయి, విశ్వాసం తగ్గింది. ఝావో వంటి కీలక వ్యక్తిపై చర్య తీసుకోవడం చైనా అంతర్గత రాజకీయాల్లోని మార్పులను సూచిస్తుంది. అయితే అధికారిక కారణం వెల్లడికాకపోవడం వల్ల ఇది కేవలం అవినీతి వ్యతిరేక చర్యా, లేక సరిహద్దు విధానాలపై అసంతృప్తి ఫలితమా అనే ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. బ్రిక్స్ సమావేశాలకు కొన్ని రోజుల ముందు చైనా తీసుకున్న ఈ చర్య ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు.
చైనా సైనిక వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం, ఒకే వ్యక్తి నియంత్రణలో ఉండటం వంటి అంశాలు తాజాగా చేపట్టిన చర్యలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. భారత్ దృష్ట్యా, సరిహద్దు ఉద్రిక్తతలకు బాధ్యులైన వారిపై చర్యలు జరగడం గమనార్హం. అయినా దీర్ఘకాలిక స్థిరత్వానికి సంభాషణ, విశ్వాస నిర్మాణమే కీలకం.