Subhash Chandra : కొద్దిరోజులుగా జాతీయ మీడియాలో.. అటు గ్లోబల్ మీడియాలో జీ చానల్స్ అధినేత సుభాష్ చంద్ర గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. మనదేశంలో మీడియా మొగల్ లాగా పేరు తెచ్చుకున్నారు సుభాష్ చంద్ర. ఈయన జి చానల్స్ అధినేతగా మనదేశంలో సుపరిచితులు. ఈయన ఆధ్వర్యంలోనే ఎస్ఎల్ గ్రూప్ కొనసాగుతోంది.
సుభాష్ చంద్ర ఎస్ ఎల్ గ్రూపును కేవలం మీడియాకు మాత్రమే పరిమితం చేయలేదు.. మౌలిక సదుపాయాలు.. అమ్యూజ్మెంట్ పార్కుల వరకు విస్తరించారు. సుభాష్ చంద్ర కు ప్రస్తుతం 75 సంవత్సరాల వయసు. ఇటీవల ఆయన 22, 006 కోట్ల రుణానికి సంబంధించి విముక్తి పొందిన తర్వాత.. సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఆయన వీడియో రూపంలో బయటపెట్టారు. తదుపరి తాను ఏం చేయబోతున్నాను క్లారిటీ ఇచ్చారు.
సుభాష్ చంద్ర విడుదల చేసిన వీడియో ప్రకారం ఆయన తదుపరిగా స్విజర్లాండ్ లో పెట్టుబడిదారులతో కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంకుర సంస్థలలో పెట్టుబడి పెట్టడానికి ఆయన తన కుటుంబం నుంచి డబ్బును అప్పుగా తీసుకోవాలని అనుకున్నట్టు సమాచారం. 22, 006.57 కోట్ల రుణంలో కొంత భాగాన్ని మాత్రమే తిరిగి పొందే విధంగా జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునల్ ఇటీవల ఒక రుణ చెల్లింపు ప్రణాళికను ఆమోదించింది. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులకే ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
2026 ఆగస్టు చివరి వారంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆయన సమర్పించిన రుణ విముక్తి ప్రణాళికను ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే సుభాష్ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. స్విజర్లాండ్ లోని ఇన్వెస్ట్మెంట్ కంపెనీలలో పనిచేస్తున్న తన స్నేహితులు.. అసోసియేట్స్ తో కలిసి ప్రొఫెషనల్ రోల్ లో పని చేయబోతున్నట్టు సుభాష్ చంద్ర ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన వివరాలను ఆయన త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఇక అంకుర సంస్థలలో తన కుటుంబ సభ్యుల నుంచి రెండు నుంచి నాలుగు కోట్ల వరకు అప్పుగా తీసుకొని.. ఆ డబ్బు వృద్ధి చెందే అంతవరకు పెట్టుబడి పెడుతూనే ఉంటానని సుభాష్ చంద్ర ప్రకటించారు. చెల్లించాల్సిన అప్పుల కోసం సుభాష్ చంద్ర తనకు ఉన్న ఆస్తులను అమ్మేశారు. మిగిలిన చివరి 6.5 కోట్లను ఎన్సీఎల్టీ ప్రణాళిక ప్రకారం రుణదాతలకు ఇస్తున్నట్టు ఇటీవల సుభాష్ చంద్ర ప్రకటించారు. ప్రస్తుతం ఆయనకు ఒక ఇల్లు మాత్రమే మిగిలి ఉంది. దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే డబ్బులతో తన ఖర్చులు వెల్లడిస్తున్నట్టు సుభాష్ చంద్ర ప్రకటించారు.
తాను వ్యాపార రంగంలో ఎన్నో రకాలుగా సంచలనాలను సృష్టించానని.. శూన్యం నుంచి సామ్రాజ్యాన్ని నిర్మించిన అనుభవం తనకు ఉందని.. మళ్లీ డబ్బు సంపాదించే నమ్మకం తనకు ఉందని సుభాష్ చంద్ర తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎస్ఎల్ గ్రూపులో కంపెనీల కోసం సుభాష్ చంద్ర వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చారు. ఆయనపై 22,006 కోట్ల క్లెయిమ్ లు వచ్చాయి. వ్యక్తిగతంగా ఆయన నెట్ వర్త్ తగ్గిపోయిన నేపథ్యంలో కేవలం 6.5 కోట్లు చెల్లించే సెటిల్మెంట్ ప్లాన్ కు ఎన్సిఎల్టి ఆమోదం తెలిపింది. అయితే దీనిపై కొన్ని బ్యాంకులు అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉంది.