Vemuri Vamsikrishna : కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ.. కొన్ని గ్రూపులలో తీవ్రమైన విమర్శలు.. పచ్చ మీడియా మళ్ళీరంకెలు వేస్తోంది.. తెలంగాణ మీద విషం చిమ్ముతోంది… ఈ పచ్చ మీడియాను ఎదుగనీయకూడదు.. ఎక్కడికక్కడ తొక్కేయాలి. వీళ్లను ఎదగనిస్తే తెలంగాణ ను మొత్తం నాశనం చేస్తారు.. ఆంధ్ర పాలకులకు అనుకూలంగా రాస్తారు.. పచ్చగా ఉన్న తెలంగాణ మీద విషం చిమ్ముతారు.. ఇదిగో ఇలా సాగిపోతోంది విమర్శల పరంపర.
అకస్మాత్తుగా ఈ గ్యాంగ్ ఎందుకు ఇలా లేచింది.. ఎందుకు తెలంగాణ ప్రయోజనాలని మాట్లాడుతోంది.. ఏంటి సంగతి అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. రేవంత్ రెడ్డి చర్నాకోలు పట్టుకొని లేశాడు కదా.. కమాన్ కేసీఆర్ నీ భూముల లెక్కను తేల్చాలి అంటున్నాడు కదా.. అధికారులను పంపించాడు కదా.. ఆల్రెడీ గడ్డం వివేక్.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాడు కదా.. కెసిఆర్ భూముల లెక్కలు తేల్చి దళితులకు అప్పగిస్తానని అన్నాడు కదా.. బహుశా అందువల్లేనా వీళ్లంతా ఈ స్థాయిలో ఆగ్రహ ఆవేశాలు బయట పెడుతున్నది.. అందు గురించేనా వీళ్లంతా ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నది.. అని అందరూ అనుకున్నారు.. కానే కాదు.
వీళ్లకు కోపం రావడం వెనక.. ఈ స్థాయిలో తెలంగాణ ప్రయోజనాలు గుర్తుకు రావడం వెనుక ఒక పేపర్ ఉంది. వాస్తవానికి ఆ పేపర్ ఆంధ్రజ్యోతి కాదు.. ఈనాడు అంతకంటే కాదు. సాక్షి ఎప్పట్లాగే మరో నమస్తే తెలంగాణ 2లాగా మారిపోయింది.. కొన్ని సందర్భాలలో నమస్తే తెలంగాణను మించిపోతుంది. ఆంధ్రజ్యోతి పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ అన్న కొడుకు వేమూరి వంశీకృష్ణ ప్రభాత ఉదయం అనే పేరుతో ఒక పత్రికను స్టార్ట్ చేశాడు. ఎడిటర్ కట్ట శేఖర్ రెడ్డి. ఇప్పటికే ఎంపికలు పూర్తయ్యాయి. జిల్లాలలో రిక్రూట్మెంట్ కూడా మొదలుపెట్టారు. దీంతో ఒక సెక్షన్ ప్రజలు ప్రభాత ఉదయం మీద తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు. దీనికి ప్రభాత ఉదయం మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి వంశీకృష్ణ క్లారిటీ ఇచ్చారు.
“ప్రభాత ఉదయం పత్రిక గురించి మేము రాయబోయే వార్తల గురించి సోషల్ మీడియాలో కొన్ని కోయిలలు ముందే కూస్తున్నాయి. నా వృత్తిపరమైన సంబంధాలు.. రక్తసంబంధాలు.. గత వ్యాపార బంధాలను చూపించి తప్పుడు సూత్రీకరణలు చేస్తున్నాయి. యధావిధిగా కలానికి కులాన్ని అంటగట్టి దుస్సాహసం చేస్తున్నాయి. నా నేపథ్యాన్ని చూపించి అదిగో పులి అంటే ఇదిగో తోక అని సంబరపడండి. కానీ మా అక్షరాలు ఎవరి పక్షమో.. మా కలాలు ఎవరికోసమో.. ప్రభాత ఉదయం ప్రజల ముందుకు వచ్చిన నాడు అధికార విపక్షాలన్నింటికీ స్పష్టంగా తెలుస్తుంది.. అంతలోనే ఈ తత్తరగత్తరలు దేనికి.. ఇదిగో ఇలా సాగిపోయింది వేమూరి వంశీకృష్ణ వివరణ.
వేమూరి రాధాకృష్ణ అన్న కొడుకు కాబట్టి వేమూరి వంశీకృష్ణ మీద ఈ స్థాయిలో ఆగ్రహం ఉండడం సహజం. పైగా ఇప్పుడు వేమూరి రాధాకృష్ణ గులాబీ పార్టీకి కొరకరానికి కొయ్యలాగా మారిపోయాడు. వాస్తవానికి రాధాకృష్ణ గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే తన నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. అలాంటప్పుడు గులాబీ పార్టీ కచ్చితంగా రాధాకృష్ణను కార్నర్ చేస్తుంది. ఇటీవల ఏబీఎన్ ముందు గులాబీ పార్టీ ఆందోళనకు దిగింది. పైగా గులాబీ పార్టీ నాయకులతో కమాన్ సయ్యా అంటూ వేమూరి రాధాకృష్ణ సవాల్ విసురుతున్నారు. అలాంటప్పుడు గులాబీ పార్టీకి కోపం ఉంటుంది కదా.. అందువల్లే ఆ కోపాన్ని ఇలా వేమూరి రాధాకృష్ణ అన్న కొడుకు మీద చూపిస్తోంది. ప్రభాత ఉదయం మొదలే కాలేదు.. కానీ యుద్ధం మొదలైపోయింది.. చూడాలి మరి ఈ యుద్ధం ఎక్కడిదాకా సాగుతుందో..