ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారం ఇప్పట్లో తేలేట్టు కనిపించట్లేదు. ఈ ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటూ విపక్షాలు వేర్వేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. కౌంటింగ్ ప్రక్రియను నిలిపేయాలని, ఎన్నికలనే రద్దు చేయాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.
పోలింగ్ తేదీకి కనీసం నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు పరచాలన్న సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలు నిర్వహించారంటూ టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహించిన ఈ ఎన్నికలను పూర్తిగా రద్దు చేయాలని జనసేన, బీజేపీ నేతలు కోర్టు మెట్లు ఎక్కారు. ప్రస్తుతం డివిజన్ బెంచ్ లో కేసు నడుస్తోంది.
ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆర్నెల్ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రత్యేక పాలన గడువు ముగియడంతో.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే.. ఈ పరిస్థితి ఎన్నికల్లో పోటీ చేసిన వారికి శరాఘాతంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసిన వారు భారీగానే ఖర్చు చేసి ఉంటారు. అప్పులు తెచ్చుకున్నోళ్లు కూడా ఉంటారు. ఇటు చూస్తేనేమో ఫలితాలు ఇప్పట్లో తేలెట్టు కనిపించట్లేదు. దీంతో.. ఏం చేయాలో అర్థం కాక, గెలుస్తామా? ఓడుతామా? అనే టెన్షన్ ఇంకా మోయలేక అవస్థలు పడుతున్నారు.
కానీ.. విషయం కోర్టు పరిధిలో ఉంది. విచారణ కొనసాగుతూనే ఉంది. న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చిన తర్వాతనే.. మిగిలిన వ్యవహారం మొదలు కానుంది. ఆ తర్వాతనే ఎన్నికల కౌంటింగ్ చేపట్టడం.. విజేతలను ప్రకటించడం జరుగుతుంది. అనంతరమే.. పరిషత్ లో ప్రజాప్రతినిధుల పాలన మొదలవుతుంది. అప్పటి వరకు కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురు చూడాల్సిందే. ఒకవేళ ఎన్నికలనే గనక రద్దు చేస్తే.. కథ మొత్తం మొదట్నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది.