miracle survival : సాధారణంగా రహదారుల్లో గోతులు ఉంటే చాలా అసౌకర్యానికి గురవుతాం. ఇక రోగులతో వెళ్లే వాహనాలు ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. రోడ్డు గుంతలు ఉంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు ఈ అత్యవసర వాహనాలను. అయితే ఓ రోడ్డు గుంత మూలంగా.. చనిపోయిందని భావించిన మహిళ లేచింది. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. మీరు చదివింది నిజం. ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన. నిజంగా ఆశ్చర్యం వేయక మానదు.. అంతలా ఉంది ఈ ఘటన. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఓ మహిళా చికిత్స పొందుతూ మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని స్వగ్రామానికి అంబులెన్స్ లో తెస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
* ఏలూరు జిల్లాలో ఘటన..
ఏలూరు జిల్లా కైకలూరు మండలం బూజులపట్నం గ్రామానికి చెందిన గురజాల రామ తులసి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. రెండు రోజుల కిందట ఆమె పరిస్థితి విషమించడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఏలూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించారు. అయితే ఆమెను బతికించడం కష్టమని.. ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. గురువారం తెల్లవారుజామున వెంటిలేటర్పై సిపిఆర్ సహా అన్ని వైద్య సేవలు అందించారు. పల్స్ పడిపోవడంతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రైవేటు అంబులెన్స్లో ఇంటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
* అంత్యక్రియలకు ఏర్పాట్లు..
అయితే ఆమె ఆ గ్రామానికి మాజీ సర్పంచ్. ఓ పార్టీకి చెందిన ప్రముఖ నాయకురాలు కూడా. దీంతో సోషల్ మీడియా వేదికగా నివాళుల పోస్టులు ముంచెత్తాయి. భారీగా అంత్యక్రియలు జరిపేందుకు కూడా నిర్ణయించారు. అయితే అంబులెన్స్ లో ఇంటికి తీసుకొస్తుండగా.. మండవల్లి మండలం పులపర్రు వద్ద ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన అంబులెన్స్.. రోడ్డుపై గుంతలో పడింది. ఆ కుదుపుతో ఆమెలో ఒక్కసారిగా చలనం వచ్చింది. ఆశ్చర్యానికి లోనైన కుటుంబ సభ్యులు వెంటనే మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్ష చేసిన వైద్యులు కొన ఊపిరితో ఉన్నారని.. బతకడం కష్టమని తెలిసి చెప్పారు. వెంటనే అక్కడ నుంచి ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించి.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల బృందం ప్రత్యేక వైద్య సేవలు అందించడంతో సాయంత్రానికి సాధారణ స్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. చనిపోయారు అనుకున్నా ఆమె మృత్యుంజయురాలుగా నిలవడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రోడ్డు కుదుపుతో లేచిన ప్రాణం నిలబడడం నిజంగా విశేషం. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నడుస్తోంది.